Anakapalli: నిత్యావసర ధరల మంట: అనకాపల్లిలో సీపీఎం ఇంటింటి ప్రచారం
Anakapalli: నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి గవరపాలెంలో సీపీఎం ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Anakapalli: నిత్యావసర ధరల మంట: అనకాపల్లిలో సీపీఎం ఇంటింటి ప్రచారం
అనకాపల్లి: రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ శనివారం అనకాపల్లి గవరపాలెంలో సీపీఎం ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఎం మండల కన్వీనర్ గంటా శ్రీరామ్, జిల్లా కమిటీ సభ్యులు బి. ఉమామహేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు కాళ్ల తలయ్యబాబు మాట్లాడుతూ.. ప్రజల ఆదాయాలు పెద్దగా పెరగకపోయినా నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయని అన్నారు. బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయలు, పంచదార, పాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు.
పంచదార కిలో రూ.40 నుంచి రూ.70కు, బెల్లం రూ.50 నుంచి రూ.80కు పెరిగిందని తెలిపారు. 25 కిలోల బియ్యం ధర రూ.1,050 నుంచి రూ.1,800కు చేరిందని, కందిపప్పు ధర రూ.120 నుంచి రూ.130కు పెరిగిందని వివరించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాల వంటింటి బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు.
ఒకవైపు ఉపాధి అవకాశాలు తగ్గడం, ఆదాయాలు పెరగకపోవడం, మరోవైపు నిత్యావసర ధరలు పెరుగుతుండటంతో ప్రజలు అప్పుల పాలవుతున్నారని సీపీఎం నాయకులు అన్నారు. పిల్లల చదువులు, వైద్యం వంటి ముఖ్యమైన ఖర్చులను సైతం వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ధరలను నియంత్రించి ప్రజలకు ఉపశమనం కల్పిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల నియంత్రణలో విఫలమైందని వారు విమర్శించారు. కమిటీలు, సమీక్షల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
నిత్యావసర ధరలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.




