Anakapalli: అనకాపల్లిలో ఘనంగా అక్కినేని నాగేశ్వరరావు జయంతి వేడుకలు!
Anakapalli: అనకాపల్లిలో ఘనంగా అక్కినేని నాగేశ్వరరావు జయంతి వేడుకలు.. వృద్ధులకు అన్నదానం, ఏఎన్నార్కు భారతరత్న ఇవ్వాలని అభిమానుల డిమాండ్.
Anakapalli: అనకాపల్లిలో ఘనంగా అక్కినేని నాగేశ్వరరావు జయంతి వేడుకలు!
Anakapalli: లెజెండరీ నటుడు, నటసామ్రాట్ దివంగత అక్కినేని నాగేశ్వరరావు జయంతి వేడుకలు అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి గాంధీనగర్లోని శ్రీ సత్యసాయి బాబా మందిరంలో శ్రీ సంజీవ్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
శ్రీ సంజీవ్ సేవా ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ శిలపరశెట్టి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో, వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్ అక్కినేని నాగేశ్వరరావు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శిలపరశెట్టి సంజీవ్ రావు సమక్షంలో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, ఎన్టీఆర్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఆళ్ల రామచంద్రరావు, అనకాపల్లి నాగచైతన్య, అఖిల్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. భానుచందర్ (అఖి) తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ముందుగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా అక్కినేని నాగేశ్వరరావు జయంతి కేక్ను కట్ చేసి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం శ్రీ సంజీవ్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. వెండితెరపై ఆయన పోషించిన పాత్రలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని కొనియాడారు. అక్కినేని జయంతి సందర్భంగా వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేయడం ద్వారా శ్రీ సంజీవ్ సేవా ఫౌండేషన్ సేవా దృక్పథాన్ని చాటుకుందని ప్రశంసించారు.
అనంతరం శిలపరశెట్టి సంజీవ్ రావు మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు పాటించిన క్రమశిక్షణ, సేవా భావం తమకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. అనకాపల్లిలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఆయనకు భారతరత్న అవార్డు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో కూడా అక్కినేని నాగేశ్వరరావు స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సంజీవ్ సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఇసరపు రమేష్, కార్యదర్శి గల్లా మహేష్, ఉపాధ్యక్షులు అల్తి శ్రీనివాస్, సరగడం విజయ్ బాబు, సంయుక్త కార్యదర్శులు సూరిశెట్టి శ్రీనివాస్, రెడ్డి జగన్ కుమార్తో పాటు అక్కినేని అభిమానులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




