Burning Topic: ఎర్ర సముద్రంలో పట్టు బిగిస్తున్న హౌథీలు!
Burning Topic: సౌదీ-హౌతీల మధ్య మళ్లీ రాజుకున్న యుద్ధం. ఎర్ర సముద్రంలో నౌకా ముట్టడి, అరామ్కోపై దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు.
Burning Topic: ఎర్ర సముద్రంలో పట్టు బిగిస్తున్న హౌథీలు!
Burning Topic: పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం ఇంకా ముగియక ముందే సౌదీ అరేబియా, యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ మధ్య ఘర్షణ కొత్త ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో నిన్నటి దాకా హర్మూజ్ జలసంధి చుట్టూ తిరిగిన పోరాటం, ఎర్ర సముద్రం వైపు మారింది. సరిహద్దు వివాదాలు, వైమానిక దాడులు తీవ్రమయ్యాయి. వాస్తవానికి ఈ వివాదం 2015 నుంచి కొనసాగుతోంది. 'జైదీ షియా' తెగకు చెందిన హౌతీలు యెమెన్లో సున్నీ ప్రభుత్వాన్ని కూల్చడంతో అక్కడ అంతర్యుద్దం మొదలైంది. తమ సరిహద్దు దేశమైన యెమెన్లో షియా తిరుగుబాటుదారులు బలం పుంజుకోవడం, వారికి తమ ప్రత్యర్థి దేశమైన ఇరాన్ మద్దతు ఇవ్వడం సౌదీ అరేబియాకు నచ్చలేదు. దీంతో యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ అరేబియా నేతృత్వంలోని అరబ్ కూటమి హౌతీలపై సైనిక దాడి చేపట్టడంతో సమస్య తీవ్రమైంది. పశ్చిమాసియాలో పట్టు కోసం సున్నీ ముస్లిం దేశమైన సౌదీ అరేబియా, షియా ముస్లిం దేశమైన ఇరాన్ మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధంగా మారింది.
సుమారు నాలుగేళ్ల నిశ్శబ్దం తర్వాత ఈ ఏడాది జూలై నుండి ఇరుపక్షాల మధ్య యుద్ధం మళ్లీ రాజుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ నేపథ్యంలో పశ్చిమాసియాలో హౌతీ తిరుగుబాటుదారులు తమ సత్తా చాటుకోడానికి సిద్దమయ్యారు. అమెరికాకు సౌదీ అరేబియా అండగా ఉండటంతో ఇరాన్ పరోక్షంగా హౌతీలను రెచ్చగొట్టిందని చెబుతున్నారు. ఎర్ర సముద్రం మీద పట్టుకోసం హౌతీలు సౌదీ అరేబియాపై నావికా ముట్టడి ప్రకటించారు. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మండేబ్ జలసంధి, వ్యూహాత్మక 'మోచా' ఓడరేవు నగరాన్ని హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. ఇది సౌదీ చమురు ఎగుమతులకు తీవ్ర ముప్పుగా మారింది. సౌదీ అరేబియా తమపై విధిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అరామ్కో ఇంధన కేంద్రాలు, అభా విమానాశ్రయం, యన్బు లోని చమురు పైప్లైన్లపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో భారీ దాడులు చేశారు. ఇటీవలి దాడుల్లో దాదాపు 73 మందికి పైగా గాయపడ్డారు.
హౌతీలు తాజా ముస్లింల పవిత్ర నగరమైన మక్కాను టార్గెట్ చేసినట్లు వచ్చిన వార్తలు కలకలం రేపాయి. హౌతీల ప్రయోగించిన డ్రోన్లను మధ్యలోనే కూల్చేశామని సౌదీ ప్రకటించింది. మక్కాను ‘రెడ్ లైన్’గా ప్రకటించింది. నగరం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు తెలిపింది. ఈ దాడులను 57కు పైగా ముస్లిం దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్లామిక్ సహకార సంస్థ కూడా ఖండించింది. అయితే యెమెన్ సరిహద్దు నుంచి సుమారు 680 మైళ్ల దూరంలో ఉన్న మక్కా వైపు డ్రోన్లను ప్రయోగించినట్లు వచ్చిన ఆరోపణలను హౌతీ రెబెల్స్ ఖండించారు. తాము ఎలాంటి దాడి చేయలేదని పేర్కొన్నారు. కాగా పవిత్ర స్థలాలను అడ్డం పెట్టుకుని ముస్లిం దేశాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఇరాన్ ఆరోపించింది. మక్కా పేరుతో జరుగుతున్న ఈ ఆరోపణలను రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికింది. నిరాధార ఆరోపణలతో ముస్లిం దేశాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేసింది.
తాజాగా యెమెన్ గగనతలంలో సౌదీ అరేబియాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చేశామంటూ హౌతీలు చేసిన ప్రకటన కలకలం రేపింది. స్థానికంగా తయారుచేసిన క్షిపణితో ఈ విమానాన్ని కూల్చినట్లు ప్రకటించింది. విమానం కూలుతున్న దృశ్యాలంటూ వీడియోను కూడా విడుదల చేసింది. ఇది సౌదీ రక్షణ వ్యూహాలకు పెద్ద దెబ్బగా మారింది గత వారం రోజుల్లో సౌదీ అరేబియా 450కిపైగా వైమానిక దాడులు జరిపిందని హౌతీలు ఆరోపించారు. ఖమీస్ ముషైత్, తాయిఫ్ వైమానిక స్థావరాల నుంచి ఎఫ్-15, టైఫూన్ యుద్ధవిమానాలతో దాడులు చేసినట్లు పేర్కొన్నారు. తైజ్, లహిజ్, అల్-జౌఫ్, హజ్జా, మారిబ్, సాదా, అల్-బైదా ప్రావిన్సుల్లో దాడులు జరిగాయని, పౌరులు మరణించడంతోపాటు పలువురు గాయపడ్డారని హౌతీలు వెల్లడించారు. ఈ దాడులకు ప్రతిగా మారిబ్ గగనతలంలోకి వచ్చిన సౌదీ యుద్ధ విమానాలపై తమ దళాలు క్షిపణులతో దాడి చేశాయని ఆరోపించారు.
పశ్చిమాసియాలో హౌతీలు తమపై తీవ్రంగా దాడులు చేస్తున్నా, అమెరికా నుంచి ఆశించిన స్పందన లేకపోవడం సౌదీ అరేబియాను విస్మయానికి గురి చేస్తోంది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అమెరికా సాయం కోరినప్పటికీ హౌతీలపై నేరుగా సైనిక చర్యకువెనుకంజ వేస్తుండటం సమస్యగా మారింది. మరోవైపు అమెరికా అధికారులు ఒమన్లో హౌతీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎర్ర సముద్రంలో నౌకాయానం కొనసాగడం, అమెరికా-హౌతీల మధ్య గతంలో కుదిరిన కాల్పుల విరమణను కొనసాగించడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని హౌతీ ప్రతినిధులు హామీ చెబుతున్నారు..కాగా అమెరికా-హౌతీల మధ్య అధికారిక ఒప్పందం కుదిరిందని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. ఎర్ర సముద్రంలో అమెరికా నౌకాయాన ప్రయోజనాలకు హామీ లభిస్తే.. సౌదీ ప్రయోజనాలు మాత్రం పక్కకు నెట్టబడే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన నెలకొంది.
హౌతీల దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాకు ప్రత్యక్ష సైనిక మద్దతు ఇవ్వకూడదని అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. హౌతీలకు వ్యతిరేకంగా వైమానిక దాడులు చేయాలని సౌదీ కోరినప్పటికీ, అమెరికా తిరస్కరించింది. 2025లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని హౌతీలు అమెరికాకు హామీ ఇచ్చారు. ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలపై తాము దాడులు చేయబోమని, కేవలం సౌదీ అరేబియా నౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటామని హౌతీలు స్పష్టం చేశారు. దీనితో అమెరికా ఈ వివాదానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దాదాపు ఒక శతాబ్ద కాలంగా అమెరికా రక్షణ వ్యవస్థలపై వందల బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టిన సౌదీ అరేబియా, తాము సంక్షోభంలో ఉన్నప్పుడు అమెరికా తమను ఆదుకుంటుందని ఆశించింది. ఇందుకు విరుద్దంగా తాజా పరిణామాలు సౌదీ అరేబియాను ఆందోళనకు గురి చేస్తున్నాయి.




