Tirupati: మెగా డీఎస్సీపై అసెంబ్లీలో చర్చకు జగన్ సిద్ధమా?: శాప్ చైర్మన్!
Tirupati: మెగా డీఎస్సీపై అసెంబ్లీలో చర్చకు రావాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి శాప్ చైర్మన్ రవినాయుడు సవాల్ విసిరారు.
Tirupati: మెగా డీఎస్సీపై అసెంబ్లీలో చర్చకు జగన్ సిద్ధమా?: శాప్ చైర్మన్!
తిరుపతి: మెగా డీఎస్సీలో ఎలాంటి అవినీతి జరగలేదని ఉపాధ్యాయులు నినదిస్తూ విజయవాడలో నిర్వహించిన ర్యాలీ విజయవంతమైందని షాప్ ఛైర్మన్ రవినాయుడు అన్నారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో కదం తొక్కడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. టీచర్ల గర్జన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గుండెల్లో బాంబులు పడ్డట్టుగా ఉందని విమర్శించారు.
త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మెగా డీఎస్సీపై చర్చకు వచ్చే దమ్ము జగన్కు ఉందా అని రవినాయుడు ప్రశ్నించారు. డీఎస్సీ విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజమైతే, నిరుద్యోగులపై నిజమైన ప్రేమ ఉంటే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై మెగా డీఎస్సీపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ డీఎస్సీపై చర్చకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
రోజాపై రవినాయుడు ఫైర్...
మాజీ మంత్రి ఆర్కే రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలను రవినాయుడు తీవ్రంగా ఖండించారు. సీఎం చంద్రబాబు మహిళలను మోసం చేశారని రోజా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నెలకు ఒకరోజు నగరికి వచ్చి మాట్లాడే రోజా మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. ఒకరోజు చెన్నై, మరోరోజు హైదరాబాద్లో ఉండే రోజాను నగరి ప్రజలు కూడా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.
మహిళలకు గౌరవం ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని రవినాయుడు పేర్కొన్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడటం వైసీపీ నేతలకే చెల్లుతుందని విమర్శించారు. మాజీ క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన రోజా, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలోని అవినీతి ఆరోపణలపై చర్చకు రావాలని సవాల్ చేశారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై బురదజల్లేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రూప్-1 నియామకాల్లో భారీ స్కామ్ జరిగిందని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పేద ప్రజలకు అందుతున్నాయా లేదా అనేది తెలుసుకోవాలంటే ప్రజల్లోకి వెళ్లి అడగాలని రవినాయుడు సూచించారు. ఓటుకు నోటు అంశంపై రోజా మాట్లాడే ముందు కేసీఆర్, కేటీఆర్ గురించి మాట్లాడాలని ఆయన హితవు పలికారు.




