Aadhaar: ఇంట్లో కూర్చునే మొబైల్ ద్వారానే ఇలా ఆధార్లో ఈ-మెయిల్ మార్చుకోండి
Aadhaar: ప్రస్తుత కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు సంబంధించిన ప్రతి పనికి ఆధార్ కార్డు అత్యంత కీలకమైన పత్రంగా మారిపోయింది.
Aadhaar
Aadhaar: ప్రస్తుత కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు సంబంధించిన ప్రతి పనికి ఆధార్ కార్డు అత్యంత కీలకమైన పత్రంగా మారిపోయింది. ఇందులో మన వ్యక్తిగత వివరాలన్నీ కచ్చితంగా, అప్డేటెడ్గా ఉండటం చాలా అవసరం. అయితే చాలామంది ఆధార్తో తమ ఈ-మెయిల్ ఐడీని లింక్ చేసుకుని ఉండరు లేదా పాత ఈ-మెయిల్ ఐడీని మార్చుకోవాలని చూస్తుంటారు. అలాంటి వారి కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఒక చక్కటి వెసులుబాటును కల్పించింది. ఇకపై ఎక్కడికీ వెళ్లకుండా, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగకుండా కేవలం స్మార్ట్ఫోన్ ద్వారానే ఇంట్లో కూర్చుని ఈ-మెయిల్ ఐడీని జోడించుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు.
డిసెంబర్ 31, 2026 వరకు ఉచిత సేవ
సాధారణంగా ఆధార్ కేంద్రానికి వెళ్లి ఈ-మెయిల్ ఐడీ అప్డేట్ చేయించాలంటే రూ.75 వరకు ఫీజు చెల్లించాల్సి వచ్చేది. కానీ UIDAI తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, అధికారిక 'Aadhaar App' ద్వారా ఈ-మెయిల్ ఐడీని అప్డేట్ చేసుకునే వారికి ఈ ఫీజు పూర్తిగా రద్దు చేసింది. ఈ ఉచిత సేవ డిసెంబర్ 31, 2026 వరకు అందుబాటులో ఉంటుందని UIDAI స్పష్టం చేసింది. కాబట్టి వినియోగదారులు ఈ గడువులోగా ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా తమ ఈ-మెయిల్ అడ్రస్ను ఆధార్తో అనుసంధానం చేసుకోవచ్చు.
మొబైల్ యాప్ ద్వారా ఈ-మెయిల్ అప్డేట్ చేసే విధానం
ఆండ్రూయిడ్ లేదా ఐఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి అధికారిక UIDAI ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్లోకి లాగిన్ అయిన తర్వాత ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఫేస్ ఆథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. భద్రత కోసం 6 అంకెల పిన్ నంబర్ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత యాప్లో కనిపించే 'Email ID Update' ఆప్షన్ను ఎంచుకుని, మీరు జోడించాలనుకుంటున్న కొత్త ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేస్తే సరిపోతుంది. కొద్ది రోజుల్లోనే మీ ఆధార్కు కొత్త ఈ-మెయిల్ లింక్ అయిపోతుంది.




