కివీస్ పర్యటన షెడ్యూల్పై వివాదం.. బీసీసీఐని చెప్పకుండానే మ్యాచ్ల ఖరారు..!
India Tour Of New Zealand: భారత క్రికెట్ జట్టు (Team India) త్వరలో తలపడనున్న న్యూజిలాండ్ (New Zealand) పర్యటన షెడ్యూల్ తీవ్ర వివాదానికి దారితీసింది.
కివీస్ పర్యటన షెడ్యూల్పై వివాదం.. బీసీసీఐని చెప్పకుండానే మ్యాచ్ల ఖరారు..!
India Tour of New Zealand: భారత జట్టు రెండు నెలల సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఐదు టీ20లు, ఐదు వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్లు ఆడనుంది. ఈ టెర్రిఫిక్ షెడ్యూల్ కారణంగా వచ్చే నవంబర్ 15న ఐదో వన్డే ముగిసిన కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ తక్కువ విరామం ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఒత్తిడిని తగ్గించేందుకు శుభ్మన్ గిల్ (Shubman Gill), జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), కేఎల్ రాహుల్ (KL Rahul), నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy), ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna), కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav), మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) వంటి కీలక ఆటగాళ్లకు చివరి రెండు వన్డేలలో విశ్రాంతి కల్పించాలని యోచిస్తున్నారు. వన్డేల తరువాత జరిగే రెడ్ బాల్ మ్యాచ్ల కోసం ముందస్తు సన్నాహకాలు చేపట్టే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
అయితే ఈ పర్యటన షెడ్యూల్ రూపకల్పన సమయంలో భారత జట్టు యాజమాన్యాన్ని ఎటువంటి సంప్రదింపులు జరపలేదని ఓ ప్రముఖ నివేదిక వెల్లడించింది. దీనివల్ల ఆటగాళ్లపై తీవ్రమైన శారీరక ఒత్తిడి పడుతుందని, సరైన విశ్రాంతి లభించదని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్లిష్టమైన సమస్యను పరిష్కరించేందుకు కోచింగ్ సిబ్బందిని రెండు విభాగాలుగా విడగొట్టాలని భావిస్తున్నారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ (Morne Morkel), అసిస్టెంట్ కోచ్ సీతాంశు కొటక్ (Sitanshu Kotak), ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్లలో ఇద్దరు వన్డే జట్టుతో మౌంట్ మౌంగానుయిలోనే ఉండనున్నారు. మిగిలిన ఇద్దరు కోచ్లు టెస్టు మ్యాచ్లు ఆడే ఆటగాళ్లతో పాటు వెల్లింగ్టన్కు వెళ్లి ప్రాక్టీస్ను పర్యవేక్షించే అవకాశం ఉంది.
అక్టోబర్ 22న ప్రారంభమయ్యే ఈ వైట్ బాల్ టూర్ నవంబర్ 15 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత నవంబర్ 19 నుంచి 23 వరకు వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్టు, నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు క్రైస్ట్చర్చ్ వేదికగా రెండో టెస్టు జరగనున్నాయి. ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (World Test Championship) పట్టికలో న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉండగా, భారత్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ టెస్టు సిరీస్ రెండు జట్లకు చాలా కీలకం కానుంది.




