Hanuman Jayanti 2026: హనుమజ్జయంతి ఏడాదికి రెండుసార్లు ఎందుకు వస్తుందో తెలుసా?

Hanuman Jayanti 2026: హనుమజ్జయంతిని ఏడాదికి రెండుసార్లు ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా?

Naresh.k
Published on: 2 April 2026 9:49 AM IST
Hanuman Jayanti 2026: Why is Hanuman Jayanti Celebrated Twice a Year? Spiritual Facts Revealed
X

Hanuman Jayanti 2026

Hanuman Jayanti: హనుమంతుడు అనగానే మనకు గుర్తొచ్చేది అపారమైన భక్తి, అజేయమైన శక్తి. అయితే, రామభక్తుడైన ఆంజనేయ స్వామి జయంతిని ఏడాదికి రెండుసార్లు ఎందుకు జరుపుకుంటారు? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీని వెనుక ఉన్న పురాణ గాథలు, ప్రాంతీయ ఆచారాలు , విశేషాలను వివరిస్తూ సాగే ఆకట్టుకునే కథనం ఇక్కడ ఉంది:

ఏడాదికి రెండుసార్లు ఎందుకు?

హిందూ ధర్మంలో ప్రతి పండుగ వెనుక ఒక విశిష్టమైన అర్థం ఉంటుంది. కానీ హనుమజ్జయంతి విషయంలో మాత్రం భక్తులు ఏడాదికి రెండుసార్లు వేడుకలు జరుపుకుంటారు. ఒకటి చైత్ర పౌర్ణమి నాడు అయితే, మరొకటి వైశాఖ బహుళ దశమి నాడు. అసలు ఈ రెండు తిథుల వెనుక ఉన్న రహస్యం ఇప్పుడు చూద్దాం.

చైత్ర పౌర్ణమి

ఉత్తర భారతదేశంతో పాటు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో చైత్ర పౌర్ణమి (నేడు, ఏప్రిల్ 2, 2026) నాడే హనుమజ్జయంతిని నిర్వహిస్తారు.అంజనా దేవి గర్భాన హనుమంతుడు జన్మించిన పవిత్ర తిథి ఇదేనని వాయు పురాణం చెబుతోంది. చిన్నప్పుడు హనుమంతుడు ఆకలితో ఉండి, ఉదయిస్తున్న సూర్యుడిని చూసి ఒక ఎర్రటి పండు అని భ్రమించి, ఆకాశంలోకి ఎగిరిన రోజు కూడా ఇదేనని అంటారు. ఈ సాహసమే హనుమంతుడి శక్తిని లోకానికి చాటి చెప్పింది. అందుకే దీనిని జన్మ తిథిగా భావిస్తారు.

వైశాఖ బహుళ దశమి

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి నాడు హనుమజ్జయంతిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు.తెలుగు భక్తులు చైత్ర పౌర్ణమి నాడు హనుమద్ దీక్ష స్వీకరిస్తారు. సరిగ్గా 41 రోజుల పాటు కఠిన నియమాలతో మండలి దీక్ష చేసి, వైశాఖ బహుళ దశమి నాడు విరమణ చేస్తారు.పరాశర సంహిత ప్రకారం హనుమంతుడు వైశాఖ బహుళ దశమి, శ్రవణా నక్షత్రం, వైధృతి యోగంలో జన్మించాడని పేర్కొనబడింది. అందుకే తెలుగు వారు ఈ రోజును ప్రధాన జయంతిగా భావిస్తారు. తమిళనాడు ,కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో మూలా నక్షత్రం రోజున జయంతి జరుపుకుంటారు. కర్ణాటకలో మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమద్ వ్రతం పేరుతో వేడుకలు నిర్వహిస్తారు.

ఒక్కడే దేవుడు.. ఇన్ని జయంతిలా?

పురాణాల ప్రకారం హనుమంతుడు చిరంజీవి. అంటే ఆయనకు మరణం లేదు. కాలక్రమేణా భక్తులు ఆయన జన్మించిన తిథిని ఒకసారి, ఆయన తన శౌర్యాన్ని ప్రదర్శించిన తిథిని మరోసారి, ఆయన సీతాదేవి ఆశీస్సులు పొందిన తిథిని ఇంకొకసారి ఇలా రకరకాలుగా జరుపుకోవడం ఆచారంగా మారింది.

Naresh.k

Naresh.k

Next Story