Lakkavaram: బాగున్న తారు రోడ్డు ధ్వంసం సీసీ రోడ్డుపై గ్రామస్తుల ఆగ్రహం
Lakkavaram: లక్కవరంలో బాగున్న తారు రోడ్డును జేసీబీతో ధ్వంసం చేసి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడంపై గ్రామస్తుల ఆగ్రహం. ప్రజాధనం వృథా అవుతోందని ఆవేదన.
Lakkavaram: బాగున్న తారు రోడ్డు ధ్వంసం సీసీ రోడ్డుపై గ్రామస్తుల ఆగ్రహం
లక్కవరం: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో కొద్ది నెలల క్రితం నిర్మించిన తారు రోడ్డును జేసీబీతో ధ్వంసం చేసి, దాని స్థానంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే నిర్మించిన ఈ తారు రోడ్డు ప్రస్తుతం ఎలాంటి గుంతలు, గోతులు లేకుండా బాగానే ఉన్నప్పటికీ దానిని తొలగించి కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
ఇదే గ్రామంలో ఏళ్ల తరబడి అనేక ప్రాంతాల్లో సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇప్పటికే ఉన్న మంచి రోడ్డును తొలగించి మళ్లీ నిర్మాణం చేపట్టడం వల్ల ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయని పలువురు గ్రామస్తులు పేర్కొంటున్నారు.
రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులపై అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలన చేసి, ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లోనే అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పటికే బాగున్న రోడ్డును ఎందుకు తొలగించాల్సి వచ్చిందో సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజాధనం సద్వినియోగం అయ్యేలా అభివృద్ధి పనుల ఎంపిక, నాణ్యత, అవసరంపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి వాస్తవ పరిస్థితిని పరిశీలించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.




