Rajahmundry: బేడ జంగం ఎస్సీ సర్టిఫికెట్లు ఆన్లైన్లో ఇవ్వాలి!
Rajahmundry: రాజమహేంద్రవరంలో బేడ జంగం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు క్రమసంఖ్య-9 కింద ఎస్సీ సర్టిఫికెట్లను ఆన్లైన్లో మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
Rajahmundry: బేడ జంగం ఎస్సీ సర్టిఫికెట్లు ఆన్లైన్లో ఇవ్వాలి!
Rajahmundry: బేడ (బుడ్గ) జంగం క్రమసంఖ్య–9 కింద ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లో మంజూరు చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం బేడ (బుడ్గ) జంగం కులం షెడ్యూల్డ్ కులాల జాబితాలో క్రమసంఖ్య–9లో ఉందని నాగేశ్వరరావు తెలిపారు. 1950 నుంచి బేడ (బుడ్గ) జంగం ఎస్సీగా గుర్తింపు పొందుతోందని, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోనూ ఈ గుర్తింపు అమల్లో ఉందని పేర్కొన్నారు.
సంచార జాతుల జనగణన నిర్వహించి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని గతంలో హామీలు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. 2024 లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేడ (బుడ్గ) జంగం ఎస్సీగా కొనసాగాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ రెండు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ అమలు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు,
ఇటీవల కలెక్టర్ల సదస్సులో 24 గంటల్లో కుల ధ్రువీకరణ పత్రాల సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఆ హామీని అమలు చేసి బేడ (బుడ్గ) జంగం క్రమసంఖ్య–9 ఎస్సీ సర్టిఫికెట్లను ఆన్లైన్ విధానంలో మంజూరు చేయాలని కోరారు.
తమ న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింపజేసే కార్యక్రమాలు చేపడతామని నాగేశ్వరరావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని జవాబుదారీతనంతో వ్యవహరించాలని కోరారు. సోషల్ వెల్ఫేర్ శాఖ ఉన్నతాధికారులు సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో పల్ల వెంకట నాయుడు అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, నరేష్ యాదవ్ ఓబీసీ మోర్చా సంక్షేమ సంఘం, తురపాటి వెంకటేష్ జిల్లా అధ్యక్షుడు బేడ (బుడ్గ), వానరాశి వెంకటేశ్వరావు రామస్వామి, చిన్నారి జిల్లా వైస్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు




