Rajahmundry: రూ.48 లక్షలతో సీసీ రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన
Rajahmundry: రాజమండ్రిలో రూ.48 లక్షలతో సీసీ రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మెరుగైన వసతుల కల్పనే ధ్యేయమన్న ఎమ్మెల్యే.
Rajahmundry: రూ.48 లక్షలతో సీసీ రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన
రాజమండ్రి: స్థానిక 34వ డివిజన్ శేషయ్యమెట్టలోని న్యూ కోర్టు కాంప్లెక్స్ నుంచి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వరకు రూ.48 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలోని ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంలో భాగంగా అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు.
ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. నగరంలోని వివిధ డివిజన్లలో స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరించేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
ఇటీవల నగరంలో కూడా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామన్నారు. ఇటీవల 34వ డివిజన్లోనే వాసవి శ్రీ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలోని నల్లా ఛానెల్ పంప్హౌస్ నుంచి పుష్కర ఘాట్ వరకు రూ.2 కోట్లతో పైపులైన్ ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. ఈ పనుల ద్వారా మురుగునీరు గోదావరిలో కలిసే పరిస్థితిని నివారించి అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. 34వ డివిజన్లో చేపడుతున్న రూ.48 లక్షల సీసీ రోడ్డు పునరుద్ధరణ పనులు పూర్తయితే న్యూ కోర్టు కాంప్లెక్స్, ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వైపు రాకపోకలు సాగించే ప్రజలకు రహదారి సౌకర్యం మెరుగుపడనుందన్నారు. స్థానిక ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.




