Alamuru: ఆలమూరులో ఘనంగా 'కడిమి పూలు' కవితా సంపుటి ఆవిష్కరణ!
Alamuru: ఆలమూరులో గొడవర్తి శ్రీనివాస్ రచించిన 'కడిమి పూలు' కవితా సంపుటిని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు. సాహిత్య వైభవాన్ని కొనియాడారు.
Alamuru: ఆలమూరులో ఘనంగా 'కడిమి పూలు' కవితా సంపుటి ఆవిష్కరణ!
Alamuru: తెలుగు సాహిత్యంలో ఆలమూరు గ్రామం కీర్తి అజరామరమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. శనివారం ఆలమూరు గ్రామ దేవత రావులమ్మ ఆలయం వద్ద గ్రామానికి చెందిన కవి గొడవర్తి శ్రీనివాస్ రచించిన కడిమిపూలు కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం లో ఎమ్మెల్యే పాల్గొని కవితా సంపుటిని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదుల లక్ష్మణ శర్మ ఎమ్మెల్యే బండారు సత్యానందరావును వేదాశీర్వచనం చేసి శేష వస్త్రంతో సత్కరించారు.అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన కడిమి పూలు కవితా సంపుటి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు.
స్వాతంత్రానికి పూర్వం నుంచి ఆలమూరు గ్రామం ఎందరో కవులకు,మహా మహా రచయితలకు పేరు పొందిందని, ఆ సాహిత్య వాతావరణాన్ని నేటి కవులు సైతం కొనసాగిస్తూ ఉండడం గర్వకారణమన్నారు. కడిమి పూలు అంటే కదంబ పుష్పాలని దేవతలు కదంబ వనాల్లో నడయాడుతారని మన పురాణాలు తెలియజేస్తున్నాయని, ఆ పేరుతో కవితా సంపుటి తీసుకురావడం హర్షనీయమన్నారు.
కడిమి పూలు కవితా సంపుటి లోని ప్రజా రాజధాని అమరావతి, కాటన్ దొర, మా తల్లి గోదావరి మొదలైన కవితలను ఊటంకిస్తూ గొడవర్తి శ్రీనివాస్ మంచి కవిత్వం అందించారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని సాహితీ కార్యక్రమాలు ఆలమూరులో నిర్వహించాలని శ్రీనివాస్ మరిన్ని మంచి రచనలు చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
అనంతరం శ్రీనివాస్ కు ఎమ్మెల్యే సత్కారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజు, రచయితలు కృష్ణ శ్రీ, డా. ర్యాలి శ్రీనివాస్, డా. చల్లా రవికుమార్, గౌరీ మల్లిక్, కూటమి నాయకులు పాల్గొన్నారు.




