Razole: రాజోలు మండలంలో సాగునీటి సమస్యపై రైతుల నిరసన!

Razole: రాజోలు మండలం అరవపాలెం, చింతలపల్లిలో అసంపూర్తిగా పంట కాలువ పూడికతీత పనులు.. శిథిలావస్థకు చేరిన బ్రిడ్జితో రైతుల ఆందోళన.

PRABHU, RAZOLE
Published on: 20 Sept 2026 1:10 PM IST
Razole
X

Razole: రాజోలు మండలంలో సాగునీటి సమస్యపై రైతుల నిరసన!

Razole: మండలంలోని అరవపాలెం నుంచి చింతలపల్లి మీదుగా వెళ్లే పంట కాలువ పూర్తిగా పూడికలతో నిండిపోవడంతో నీటి ప్రవాహం తగ్గిపోయింది. దీంతో పంట పొలాలకు సాగునీరు సక్రమంగా అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆదివారం పూడికతీత పనులు చేపట్టారు.

అయితే పూడికతీత పనులు కాలువకు రోడ్డుకు ఆనుకుని ఉన్న ఒకవైపు మాత్రమే చేపడుతున్నారని, అవతలి వైపు ఉన్న పూడికలను తొలగించకుండా వదిలేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ మొత్తం పూడికలతో నిండిపోయి ఉండగా, ఒకవైపు మాత్రమే పనులు చేపట్టడం వల్ల నీటి ప్రవాహానికి పూర్తిస్థాయిలో ఆటంకాలు తొలగే అవకాశం లేదని వారు పేర్కొంటున్నారు. అధికారులు కాలువను పూర్తిస్థాయిలో పరిశీలించి, ఇరువైపులా పేరుకుపోయిన పూడికలను తొలగించాలని రైతులు కోరుతున్నారు.

శిథిలావస్థలో వంతెన.. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి డిమాండ్

ఇదిలా ఉండగా, అరవపాలెం, చింతలపల్లి గ్రామాల సరిహద్దు ప్రాంతంలో పంట కాలువపై ఉన్న బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని రైతులు తెలిపారు. వంతెన పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, పాత వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులు, గ్రామస్థుల రాకపోకలకు, వ్యవసాయ పనులకు ఇబ్బందులు కలగకుండా వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని కోరుతున్నారు.

కాలువలో పూర్తిస్థాయిలో పూడికతీత పనులు చేపట్టి, నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని రైతులు అధికారులను కోరుతున్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి, అసంపూర్తిగా ఉన్న పూడికతీత పనులను పూర్తి చేయడంతో పాటు శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జి నిర్మాణంపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE