Ongole: ఒంగోలుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు.. స్వర్ణ పతకం
Ongole: ఒంగోలు నగరంలో 80 వేలకుపైగా కుటుంబాలతో నిర్వహించిన మెగా వేస్ట్ సెగ్రిగేషన్ డ్రైవ్కు ప్రతిష్టాత్మక 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' గుర్తింపు లభించింది.
Ongole: ఒంగోలుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు.. స్వర్ణ పతకం
ఒంగోలు: తడి, పొడి చెత్త వేర్పాటులో 80 వేలకుపైగా కుటుంబాలు భాగస్వాములు కావడంతో ఒంగోలు నగరానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ల వేడుకల్లో భాగంగా శనివారం నగరవ్యాప్తంగా నిర్వహించిన మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఉల్లాజీ ఎలియాజర్ పరిశీలించారు.
నగరంలోని ఐదు శానిటేషన్ డివిజన్ల పరిధిలో అధికారులు ప్రజలకు తడి, పొడి వ్యర్థాల వేర్పాటుపై అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ పి.రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్రావు, బీఎన్ విజయ్కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి మున్సిపల్ యంత్రాంగాన్ని అభినందించారు. మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్యకు గోల్డ్ మెడల్ ధరింపజేసి ప్రశంసాపత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి.రాజాబాబు మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం, అధికారులు–సిబ్బంది సమన్వయం, ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఒంగోలుకు ఈ గుర్తింపు దక్కిందన్నారు. వ్యర్థాల వేర్పాటుతో పాటు సర్క్యులర్ ఎకానమీపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
‘ఒంగోల్.. వన్ గోల్’ : ఎంపీ
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఒకే లక్ష్యంతో ఒంగోలు ప్రజలు ముందుకు రావడంతో నగరానికి వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు లభించిందని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. కార్యక్రమంలో భాగస్వాములైన ప్రజలు, అధికారులు, సమన్వయకర్తలకు అభినందనలు తెలిపారు.
సమిష్టి కృషితో ఘనత : ఎమ్మెల్యే
ప్రజలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్రావు అన్నారు. త్వరలో ప్రతి ఇంటికీ రెండు చెత్త డబ్బాలను పంపిణీ చేస్తామని తెలిపారు. మెగా సెగ్రిగేషన్ డ్రైవ్లో పాల్గొన్న వారికి డివిజన్ల వారీగా లక్కీ డ్రా నిర్వహించి గోల్డ్ కాయిన్లు అందిస్తామని చెప్పారు.
ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరిగే ఒంగోలు 150 ఏళ్ల వేడుకల్లో లక్కీ డ్రా నిర్వహిస్తామన్నారు. నగరంలో మంచినీటి సమస్యకు రెండేళ్లలో శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని, డ్రైనేజీలు, రోడ్ల విస్తరణ, నిర్మాణ పనులపై దృష్టి సారించామని తెలిపారు.
కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్కుమార్, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, మాజీ మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకట కృష్ణయ్య, అధికారులు పాల్గొన్నారు.




