Maoists: పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత పాపారావు!

Maoists: దండకారణ్యంలో దశాబ్దాలుగా మావోయిస్టు కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అగ్రనేత పాపారావు అలియాస్ సున్నం చంద్రయ్య బుధవారం పోలీసుల ముందు లొంగిపోయారు.

Arun Chilukuri
Published on: 25 March 2026 3:46 PM IST
Maoists
X

Maoists: పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత పాపారావు!

Maoists: దండకారణ్యంలో దశాబ్దాలుగా మావోయిస్టు కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అగ్రనేత పాపారావు అలియాస్ సున్నం చంద్రయ్య బుధవారం పోలీసుల ముందు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్‌ శర్మ సమక్షంలో ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చారు. పాపారావుతో పాటు మరో 17 మంది అనుచరులు కూడా ఆయుధాలు వీడి ప్రభుత్వానికి లొంగిపోవడం గమనార్హం.

ఎవరీ పాపారావు?

పాపారావు అలియాస్ మంగు దాదా మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన పదవుల్లో పనిచేశారు. మావోయిస్టు పశ్చిమ బస్తర్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శిగా, దండకారణ్య ప్రత్యేక జోనల్‌ కమిటీ (DKSZC) సభ్యుడిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభుత్వం ఆయన తలపై ఏకంగా రూ. 2 కోట్ల రివార్డు ప్రకటించింది. 1990 నుంచి సుమారు మూడు దశాబ్దాలకు పైగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న పాపారావు, అనేక హింసాత్మక ఘటనలకు సూత్రధారిగా వ్యవహరించారు.

అడవి నుంచి బయటకు..

గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న పాపారావు, మంగళవారమే తన 17 మంది అనుచరులతో కలిసి అడవి నుంచి బయటకు వచ్చారు. బుధవారం అధికారికంగా డిప్యూటీ సీఎం ఎదుట లొంగిపోయారు. గతంలో పాపారావు భార్య, పామేడు ఏరియా కమిటీ కమాండర్‌గా పనిచేసిన ఊర్మిళ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.

మావోయిస్టులకు భారీ నష్టం

దండకారణ్య జోనల్‌ కమిటీ కమాండర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న పాపారావు లొంగిపోవడం, మావోయిస్టు పార్టీకి ఛత్తీస్‌గఢ్ మరియు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకాలకు ఆకర్షితులై ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story