Delhi Fire Tragedy: మరో ప్రమాదం.. నిద్రలోనే మంటలు.. ఢిల్లీలో ముగ్గురి దుర్మరణం
Delhi Fire Tragedy: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం తెల్లవారుజామున ఒక ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆగ్నేయ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ఎక్స్టెన్షన్లో..
Delhi Fire Accident
Delhi Fire Tragedy: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం తెల్లవారుజామున ఒక ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆగ్నేయ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ఎక్స్టెన్షన్లో ఉన్న ఒక బహుళ అంతస్తుల నివాస భవనంలో భారీగా మంటలు చెలరేగడంతో కనీసం ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున ప్రారంభమైన ఈ మంటలు క్షణాల వ్యవధిలోనే భవనం మొత్తానికి వ్యాపించాయి. ప్రాథమిక విచారణ ప్రకారం.. భవనం గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని పీటీఐ (PTI) నివేదిక పేర్కొంది.
ఐదుగురిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులను సురక్షితంగా రక్షించగలిగారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో 'సెంట్రలైజ్డ్ యాక్సిడెంట్ అండ్ ట్రామా సర్వీస్' (CATS) సిబ్బంది కూడా పాల్గొని, బాధితులను ఆసుపత్రికి తరలించడంలో సహాయపడినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. మరికొన్ని వార్తా సంస్థల సమాచారం ప్రకారం.. మొత్తం ఎనిమిది మంది గాయపడిన వారిని రక్షించి ఎయిమ్స్ (AIIMS) ట్రామా సెంటర్కు తరలించారు.
భవనంలో మూడు అంతస్తులు పూర్తిగా దగ్ధం
ఈ ప్రమాదంపై డివిజనల్ ఫైర్ ఆఫీసర్ రాజేందర్ అత్వాల్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో భవనంలోని గ్రౌండ్, మొదటి , రెండో అంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి మొత్తం 6 అంతస్తులు ఉన్న ఈ భవనంలో మంటలు చాలా వేగంగా పైకి వ్యాపించాయని ఆయన పేర్కొన్నారు. మధ్యం మార్గ్లోని నయాతార అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న గల్లీ నంబర్ 1 లోని ఒక భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతం ఓఖ్లా ఫైర్ స్టేషన్ – 1 పరిధిలోకి వస్తుంది.
ఇరుకైన వీధులతో అడ్డంకులు
అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వీధులు చాలా ఇరుగ్గా ఉండటం వల్ల సహాయక చర్యలు చేపట్టడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. ఫైర్ ఇంజన్లు లోపలికి వెళ్లడానికి, మంటలను ఆర్పే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ ఇరుకైన సందులు తీవ్ర ఆటంకం కలిగించాయి. తెల్లవారుజామున 2:35 గంటల నుండి 2:37 గంటల మధ్య కాలంలో అగ్నిమాపక శాఖకు ఈ ప్రమాదంపై వరుసగా ఫోన్ కాల్స్ వచ్చాయి.
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ మూడు వాటర్ టెండర్లు, రెండు వాటర్ బౌజర్లు, ఒక బ్రీతింగ్ సపోర్ట్ యూనిట్ , క్విక్ రెస్పాన్స్ వెహికల్ను ఘటనా స్థలానికి పంపింది. స్థానిక నివాసితుల నుండి మరిన్ని అత్యవసర కాల్స్ రావడంతో, అదనంగా మరొక వాటర్-టెండర్-కమ్ లైట్ ఫైర్ యూనిట్ను కూడా రంగంలోకి దించారు. ఎట్టకేలకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి తెల్లవారుజామున 3:45 గంటల కల్లా మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఉదయం 4 గంటల సమయానికి మంటలను ఆర్పే ప్రక్రియ అధికారికంగా ముగిసినప్పటికీ, లోపల చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ , శోధన చర్యలు మరికొంత సమయం పాటు కొనసాగాయి.




