Sangareddy: సంగారెడ్డి జిల్లాలో వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన!
Sangareddy: సంగారెడ్డి జిల్లా హత్నూరలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ పరితోష్ పంకజ్.. పకడ్బందీ భద్రతా చర్యలకు అధికారులకు ఆదేశాలు.
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన!
Sangareddy: జిల్లా వ్యాప్తంగా వినాయక శోభాయాత్రలు, నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ నిమజ్జన ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు.
హత్నూర మండలంలోని దౌల్తాబాద్, బోరపట్ల గ్రామాల్లో వినాయక నిమజ్జనాలు జరగనున్న చెరువులను జిల్లా ఎస్పీ సందర్శించారు. నిమజ్జనం సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
నిమజ్జన ప్రాంతాల్లో తగినంత లైటింగ్, బారికేడింగ్, క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా గణేష్ శోభాయాత్రలు జరిగే మార్గాల్లో రోడ్ల పరిస్థితిని పరిశీలించి, అవసరమైన మరమ్మతులు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.
చెరువుల వద్ద భద్రతా లైటింగ్, పారిశుద్ధ్య ఏర్పాట్లతో పాటు భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో హత్నూర ఎంఆర్ఓ షేక్ పర్వీన్, జిన్నారం ఇన్స్పెక్టర్ రమణ రెడ్డి, హత్నూర si శ్రీధర్ రెడ్డి తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.




