Narsapur: మాడపూర్లో కంది పంటపై రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన!
Narsapur: మాడపూర్లో కంది పంట క్షేత్ర పరిశీలన. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుతో అధిక లాభాలు, నేల సంరక్షణ సాధ్యమని వ్యవసాయ అధికారుల అవగాహన.
Narsapur: మాడపూర్లో కంది పంటపై రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన!
నర్సాపూర్: పంటల వైవిధ్యీకరణతో రైతులకు ప్రయోజనాలు చేకూరడంతో పాటు నేల ఆరోగ్యం, నీటి వనరుల సద్వినియోగం సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆరుతడి పంటల సాగులో భాగంగా కందుల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు నర్సాపూర్ మండలం మాడపూర్ గ్రామంలో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
నర్సాపూర్ మండలం లోని మాడపూర్ గ్రామానికి చెందిన రైతు శ్రీ కిష్టయ్య 5 ఎకరాల్లో సాగు చేస్తున్న కంది పంటను వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక రైతులు పరిశీలించారు. పంట ప్రస్తుత స్థితి, సాగు విధానం, పంట నిర్వహణ చర్యలపై రైతులు వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు సంధ్యా రాణి మాట్లాడుతూ.. వరి పంటపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించి, రైతులు తమ ప్రాంతంలోని నేల స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ పరిస్థితులు, ఆదాయ అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు. కందులు వంటి పప్పుధాన్య పంటలు పంటల మార్పిడిలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
కందుల సాగు వంటి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా ఆచరణాత్మక పరిజ్ఞానం పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, సాగు పద్ధతులు, పంట నిర్వహణపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.
ఈ క్షేత్ర సందర్శనలో మండల వ్యవసాయ అధికారిణి దీపిక, AEOలు మోహన్, లావణ్య, ATM హరీష్ పాల్గొన్నారు. మదాపూర్ గ్రామానికి చెందిన పలువురు రైతులు కంది పంటను పరిశీలించి సాగు విధానాలు, పంట నిర్వహణ, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.




