Hyderabad: సిర్పూర్ పేపర్ మిల్లు కార్మిక సంఘాలతో మంత్రి వివేక్ భేటీ
Hyderabad: సిర్పూర్ పేపర్ మిల్లు కార్మిక సమస్యలపై మంత్రి గడ్డం వివేక్ సమీక్ష. కార్మిక సంఘాల ఎన్నికలు, ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుపై హామీ ఇచ్చిన మంత్రి.
Hyderabad: సిర్పూర్ పేపర్ మిల్లు కార్మిక సంఘాలతో మంత్రి వివేక్ భేటీ
హైదరాబాద్: సిర్పూర్ పేపర్ మిల్లు కార్మిక సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సచివాలయంలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్, బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబుతో పాటు 10 కార్మిక సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పేపర్ మిల్లు కార్మికులకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై అడ్వకేట్ జనరల్ ద్వారా సమర్థవంతంగా వాదనలు వినిపించి, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
క్యాంటీన్ ఏర్పాటు నిబంధనల ఉల్లంఘనపై ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ఫ్యాక్టరీస్ డైరెక్టర్ నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. సిర్పూర్లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు అంశంపై కార్మిక సంఘాలు సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే సిర్పూర్లో ఏటీసీ ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు.
లేబర్ వెల్ఫేర్ సెంటర్కు సంబంధించిన స్థలాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించి, భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.కార్మికుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు.




