Gudur: గూడూరు మండలంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పర్యటన!
Gudur: కర్నూలు జిల్లా గూడూరు మండలంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి విస్తృత పర్యటన.. పాఠశాల, పీహెచ్సీ, హౌసింగ్ లేఅవుట్ పరిశీలన.
Gudur: గూడూరు మండలంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పర్యటన!
Gudur: విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత విద్య, మంచి ఉద్యోగ అవకాశాలను సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి సూచించారు. శుక్రవారం గూడూరు మండలం పెంచికలపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.
విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలలో బోధించిన పాఠాలను అదే రోజు ఇంటి వద్ద పునశ్చరణ చేసుకోవాలని, చదువులో సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. హోంవర్క్ను సకాలంలో పూర్తి చేసి, కష్టంగా అనిపించే సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. పదో తరగతి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు.
పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై కలెక్టర్ నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, వంటగది తదితర సదుపాయాలను పరిశీలించారు.
పాఠశాల పరిసరాల్లో నాటిన మొక్కలను పరిశీలించిన కలెక్టర్ గానుగ, వేప వంటి చెట్లను విరివిగా పెంచాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణత 90 శాతంగా ఉందని, 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు. ఎఫ్ఏ-1 పరీక్షలో 30కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు.
పాఠశాల అనంతరం మండలంలోని పంటలను పరిశీలించిన కలెక్టర్ రైతులతో మాట్లాడి సాగు పరిస్థితులను తెలుసుకున్నారు. పంటలను వైవిధ్యంగా సాగు చేయడం ద్వారా వివిధ సమయాల్లో దిగుబడులు అందుబాటులోకి వచ్చి, నెలకు సుమారు 15 వేల నుంచి 20 వేల వరకు నిరంతర ఆదాయం పొందే అవకాశం ఉంటుందని రైతులకు వివరించారు.
నీటి సదుపాయం లేని రైతులు కూడా PMDS విధానంలో పంటలు సాగు చేసుకోవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా పశువులకు అవసరమైన మేత లభించడంతో పాటు అదనపు మేతను విక్రయించి ఆదాయం పొందవచ్చన్నారు. రైతుల సాగు ఖర్చులు, అప్పుల భారాన్ని తగ్గించడం PMDS విధానం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు పంటల వైవిధ్యాన్ని పాటిస్తూ ఆదాయాన్ని పెంచుకునే దిశగా సాగు విధానాలను అవలంబించాలని సూచించారు.
అనంతరం గూడూరు మండల కేంద్రంలోని పిహెచ్సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి ఆస్పత్రి ద్వారా అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
తర్వాత తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. మండల పరిధిలో నెలకొన్న సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ, భూ సమస్యలు తదితర సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని తహసిల్దార్ను ఆదేశించారు. ఇళ్ల స్థలాల కోసం వచ్చే దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థల పట్టాలు అందించేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గూడూరు నగర పంచాయతీలోని ఎస్సీ కాలనీ హౌసింగ్ లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. లేఅవుట్లో మొత్తం 283 ఇళ్లు ఉండగా ఇప్పటివరకు 43 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి నెల రోజుల్లోగా నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు.
నిర్మాణాలు ప్రారంభించకపోవడానికి గల కారణాలను లబ్ధిదారులను పిలిపించి తెలుసుకుని, వారి సమస్యలను పరిష్కరించేందుకు నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం అందిస్తున్న 2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ఇప్పటికే ఇళ్లు నిర్మించుకుని బిల్లులు పొందిన లబ్ధిదారుల ఉదాహరణలను చూపించి ఇతర లబ్ధిదారులను కూడా గృహ నిర్మాణాల వైపు ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.




