Devanakonda: దేవనకొండలో తూనికల అధికారుల రాకతో దుకాణాలు బంద్!
Devanakonda: కర్నూలు జిల్లా దేవనకొండలో తూనికలు-కొలతల శాఖ అధికారులు తనిఖీలకు రాగానే వ్యాపారులు దుకాణాలు మూసివేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Devanakonda: దేవనకొండలో తూనికల అధికారుల రాకతో దుకాణాలు బంద్!
దేవనకొండ: కర్నూలు నుంచి దేవనకొండకు వచ్చిన కొలతలు–తూనికల శాఖ అధికారులు జనరల్ స్టోర్లు, కిరాణా దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. అధికారులు సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.
కిరాణా, జనరల్ స్టోర్లలో విక్రయిస్తున్న సరుకుల తూకాలు, కొలతలు, ప్యాకెట్ల పరిమాణం, ధరలు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. ముఖ్యంగా 50 కిలోల కిలోలు ఉన్నాయా లేకపోతే తక్కువ ఉందా ప్యాకెట్లతో పాటు ఇతర సరుకుల తూకాల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అనే అంశాలను తనిఖీ చేశారు.
అయితే అధికారులు దేవనకొండకు చేరుకుని తనిఖీలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న సమయంలో పలువురు కిరాణా, జనరల్ స్టోర్ యజమానులు తమ దుకాణాలను మూసివేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అధికారులు వస్తున్న విషయం ముందుగానే వ్యాపారులకు చేరిందా? సమాచారం ఎవరి ద్వారా వెళ్లింది? అనే ప్రశ్నలు వినియోగదారుల నుంచి వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, తనిఖీల్లో ఓ కూరగాయల దుకాణంలో కాటా సక్రమంగా లేదని గుర్తించి జరిమానా విధించినట్లు సమాచారం. దీంతో మిగతా కిరాణా, జనరల్ స్టోర్లలో కూడా కాటాలు, తూనికలు, కొలతలను అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.
డిజిటల్ కాటాలు ఉన్నప్పటికీ అధికారులు తనిఖీలకు వచ్చిన సమయంలో దుకాణాలను ఎందుకు మూసివేశారు? కాటాలు, కొలతలు సక్రమంగా ఉంటే తనిఖీలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? అంటూ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
కిరాణా, జనరల్ స్టోర్లలో సరుకుల తూకాలు, కొలతలు, ప్యాకేజింగ్, ధరలు తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా తనిఖీలు నిర్వహించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని స్థానిక వినియోగదారులు కోరుతున్నారు. దుకాణాలు మూసివేయడానికి గల కారణాలపై కూడా సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.




