Vijayawada: కేదారేశ్వరపేటలో వైఎస్సార్సీపీ పశ్చిమ క్లస్టర్-2 సమావేశం!
Vijayawada: విజయవాడ కేదారేశ్వరపేటలో వైఎస్సార్సీపీ పశ్చిమ క్లస్టర్-2 విస్తృత స్థాయి సమావేశం.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వెలంపల్లి డిమాండ్.
Vijayawada: కేదారేశ్వరపేటలో వైఎస్సార్సీపీ పశ్చిమ క్లస్టర్-2 సమావేశం!
Vijayawada: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, కేదారేశ్వర పేటలోని వైసిపి నాయకుడు వడ్డురి యశోధర్ నివాసంలో ఆదివారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ - 2 (34, 35, 54, 55, 56 డివిజన్ల) విస్తృత స్థాయి సమావేశం క్లస్టర్ అధ్యక్షులు వాసా ఆదినారాయణ బాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో విజయవాడ పశ్చిమ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని ఇప్పటికే జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో సమావేశాలు పూర్తి చేసుకున్నామని, ప్రస్తుతం క్లస్టర్ స్థాయిలో చివరి దశ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. వెన్నుపోటు పార్టీ వెన్నుపోటు పాలన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ లో పదవులు పొందిన నాయకులకు గుర్తింపు కార్డులను అందజేశారు .
ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రేపు 23వ తేదీ నుంచి కూటమి ప్రభుత్వ వెన్నుపోటు విధానాలు, వారి ప్రజావ్యతిరేక పాలనను ఎండగడుతూ ప్రజలందరికీ అర్థమయ్యేలా డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. క్లస్టర్ పరిధిలోని అన్ని డివిజన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందించిన అద్భుతమైన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు పార్టీకి శ్రీరామరక్షగా నిలుస్తాయని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ అక్రమాలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ అక్రమాలకు, అవినీతికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అర్హులైన నిరుద్యోగులకు న్యాయం జరిగేలా, అక్రమంగా జరిగిన నియామకాలపై సీబీఐ చేత నిష్పాక్షిక విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి వేలాది మందితో రెడ్ సర్కిల్ నుంచి ఇందిరా గాంధీ స్టేడియం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టి, శాప్ కార్యాలయంలో వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.
రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజానీకం పూర్తి సంసిద్ధతతో ఉన్నారని వెలంపల్లి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి బండి పుణ్యశీల, మాజీ కార్పొరేటర్లు శిరంశెట్టి పూర్ణ, యలకల చలపతిరావు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




