Sathupally: సత్తుపల్లిలో ఘనంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’!
Sathupally: సత్తుపల్లిలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం. జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు, అమరవీరుల స్మృతి వనాలకు డిమాండ్.
Sathupally: సత్తుపల్లిలో ఘనంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’!
Sathupally: సత్తుపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు బానోతు విజయ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా నాయుడు రాఘవరావు మాట్లాడుతూ, సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కోరారు. నిజాం పాలన, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి తమ ప్రాణాలను అర్పించిన తెలంగాణ అమరవీరుల త్యాగాలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా అమరవీరుల స్మృతి వనాలు ఏర్పాటు చేయాలని అన్నారు.
అలాగే తెలంగాణ చరిత్రను ప్రజలకు, ముఖ్యంగా యువతకు అందుబాటులోకి తీసుకురావడానికి తెలంగాణ చరిత్రను ప్రతిబింబించే విధంగా ప్రత్యేక చారిత్రక మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు.
జిల్లా కార్యదర్శి మున్నా మిశ్ర మాట్లాడుతూ, నిజాం పాలనలో రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటం చారిత్రాత్మకమని అన్నారు. 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు జరిగిన ఆపరేషన్ పోలో అనంతరం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైందని, ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ఘనంగా నిర్వహించాలని అన్నారు.
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం ఉందని, ఈ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పాలనాగ సురేందర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి మంద శివ, మండల మాజీ అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్, డాక్టర్ పెద్ది రాజు, సాయి, తొర్లపాటి సాయి యాదవ్, శివ, మన్నెం నరసింహమూర్తి, తెనాలి అశోక్, బండి ఆంజనేయులు, మంద సందీప్ తదితరులు పాల్గొన్నారు.




