Kothagudem: బాలాజీ గణపతిగా దర్శనమిచ్చిన విజయ విఘ్నేశ్వరుడు!
Kothagudem: కొత్తగూడెం శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో బాలాజీ గణపతి అలంకారంలో దర్శనం. వైభవంగా నవరాత్రి పూజలు, రుద్రాభిషేకం. భక్తుల విశేష రద్దీ.
Kothagudem: బాలాజీ గణపతిగా దర్శనమిచ్చిన విజయ విఘ్నేశ్వరుడు!
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ఉదయం సుప్రభాత సేవ అనంతరం శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. వేద పారాయణం, గణపతి అనుష్ఠానం, చతుర్వృత్తి తర్పణాలు, గణపతి హోమం నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారికి నేరేడు పత్రి పూజ, మహాలింగార్చన నిర్వహించారు.
సాయంత్రం 7 గంటలకు శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారు శ్రీ బాలాజీ గణపతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బాలాజీ, గణపతి స్వరూపాలను ఏకీకృతం చేసి ఆరాధించడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ ప్రత్యేక అలంకారాన్ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాగా, సెప్టెంబర్ 20న ఉదయం 9:30 గంటలకు గణపతి హోమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రజిని కుమారి ఒక ప్రకటనలో తెలిపారు.




