Sircilla: బాలల రక్షణపై అందరికీ అవగాహన ఉండాలి: న్యాయవాది ఆడెపు వేణు!
Sircilla: తంగళ్లపల్లిలో పోక్సో చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సు. బాలల రక్షణపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాది ఆడెపు వేణు పిలుపు.
Sircilla: బాలల రక్షణపై అందరికీ అవగాహన ఉండాలి: న్యాయవాది ఆడెపు వేణు!
సిరిసిల్ల: బాలలపై లైంగిక నేరాలను అరికట్టడంతో పాటు వారి హక్కులను పరిరక్షించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాది ఆడెపు వేణు అన్నారు. బాలల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.
తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ ఆదేశాలతో, సీనియర్ సివిల్ జడ్జి, DLSA కార్యదర్శి పి. లక్ష్మణాచారి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయవాది ఆడెపు వేణు మాట్లాడుతూ.. పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం–2012 (POCSO Act)ను అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. బాలలపై లైంగిక వేధింపులు, నేరాలను అరికట్టేందుకు చట్టంలోని అంశాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, పాఠశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్, న్యాయవాదులు కుంట శ్రీనివాస్, గుర్రం ఆంజనేయులు, అరుణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




