Karimnagar: కరీంనగర్‌లో న్యాయ, పోలీస్ శాఖల సమన్వయ సమావేశం!

Karimnagar: కరీంనగర్‌లో న్యాయవ్యవస్థ, పోలీస్ శాఖల సమన్వయ సమావేశం. డిజిటలైజేషన్, ఈ-ఎఫ్‌ఐఆర్, ఈ-సమన్స్ ద్వారా కేసుల సత్వర విచారణకు జడ్జి ఎస్.శివకుమార్, సీపీ గౌష్ ఆలం పిలుపు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 19 Sept 2026 6:42 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో న్యాయ, పోలీస్ శాఖల సమన్వయ సమావేశం!

కరీంనగర్: పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని అస్త్ర కన్వెన్షన్ హాలులో శనివారం న్యాయవ్యవస్థ, పోలీస్ శాఖల అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. న్యాయ, పోలీస్ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, కోర్టు సంబంధిత ఆన్‌లైన్ ప్రక్రియలను సమర్థవంతంగా అమలు చేయడం, కేసుల సత్వర పరిష్కారం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

డిజిటలైజేషన్‌తో న్యాయ విచారణ మరింత వేగవంతం: ప్రధాన జిల్లా న్యాయమూర్తి శ్రీ ఎస్. శివకుమార్

​కరీంనగర్ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన క్రిమినల్ చట్టాల ద్వారా న్యాయవ్యవస్థలో డిజిటలైజేషన్ మరియు ఎలక్ట్రానిక్ ఆధారాల నిర్వహణ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని కరీంనగర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్. శివకుమార్ పేర్కొన్నారు. పోలీసు మరియు న్యాయశాఖ సంయుక్త సమన్వయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, నేర న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఇంటర్-ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ICJS) ద్వారా 'వన్ డేటా – వన్ ఎంట్రీ' విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. పోలీసు దర్యాప్తు, ఫోరెన్సిక్ నివేదికలు, కోర్టు రికార్డులను సమగ్రంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అనుసంధానించడం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు కేసుల విచారణలో పారదర్శకత పెరుగుతుందన్నారు.

​హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ-ఎఫ్‌ఐఆర్ (e-FIR), ఈ-చార్జ్‌షీట్ల (e-Chargesheet) వినియోగం తప్పనిసరి అని, ఎలక్ట్రానిక్ విధానంలో ఫిర్యాదుల నమోదు, డిజిటల్ సమన్లు మరియు వర్చువల్ మోడ్‌లో సాక్షుల విచారణ వంటి ఆధునిక పద్ధతులు న్యాయ ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నాయని వివరించారు. నేర న్యాయవ్యవస్థ సజావుగా సాగాలంటే న్యాయశాఖ మరియు పోలీసు విభాగాల మధ్య నిరంతర పరస్పర సమన్వయం ఎంతో అవసరమని, ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, న్యాయవ్యవస్థ, పోలీస్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయడం ద్వారా కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, కోర్టు సంబంధిత ప్రక్రియల్లో జాప్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.

ఆన్‌లైన్ ప్రక్రియల అమలుపై ప్రత్యేక దృష్టి...

ఐసీజేఎస్, సీసీటీఎన్ఎస్ ఆన్‌లైన్ ప్రక్రియల అమలులో భాగంగా ఈ–ఎఫ్‌ఐఆర్, ఈ–ఛార్జ్‌షీట్, ఈ–సమ్మన్స్ తదితర అంశాలపై చర్చించారు. ఈ–ఎఫ్‌ఐఆర్‌లను సంబంధిత కోర్టులు సకాలంలో స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని, వాటి పర్యవేక్షణ కోసం ఈ–ఎఫ్‌ఐఆర్ స్వీకరణ సమయంలో పీటీఎన్ నంబర్ నమోదు చేయాలని సూచించారు.

అదేవిధంగా ఈ–ఛార్జ్‌షీట్‌లను సంబంధిత కోర్టులు నిర్ణీత కాలవ్యవధిలో పరిగణనలోకి తీసుకునేలా సమన్వయం చేసుకోవాలని, తద్వారా కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని సూచించారు.

ఈ–సమ్మన్స్ వినియోగానికి ప్రాధాన్యత...

వర్తించే సందర్భాల్లో సాక్షులు, నిందితులకు భౌతిక సమన్లకు బదులుగా ఈ–సమ్మన్స్ విధానం ద్వారా సమన్లు జారీ చేసే ప్రక్రియను ప్రోత్సహించాలని సమావేశంలో చర్చించారు. ఈ విధానాన్ని సకాలంలో అమలు చేయడం ద్వారా సమన్ల జారీ, అమలులో మరింత సమర్థత సాధించవచ్చని తెలిపారు.

కోర్టు, పోలీస్ సిబ్బందికి ఈ–ఎఫ్‌ఐఆర్, ఈ–ఛార్జ్‌షీట్ స్వీకరణ, ఈ–సమ్మన్స్ విధానాలపై సంయుక్తంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే అంశంపై కూడా చర్చించారు.

కోర్టు–పోలీసు సమన్వయంతో సమస్యల పరిష్కారం..

ఈ–ఎఫ్‌ఐఆర్‌లు, ఈ–ఛార్జ్‌షీట్‌లు, ఈ–సమ్మన్స్‌కు సంబంధించిన ప్రక్రియల్లో కోర్టు, పోలీస్ సిబ్బంది మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరచాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో సంబంధిత అధికారుల సహకారంతో సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.

తీర్పుల ప్రతులు, సాక్షుల వాంగ్మూలాలను సకాలంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసి అందుబాటులో ఉంచడం ద్వారా కేసుల పురోగతిని సమర్థవంతంగా పర్యవేక్షించాలని సూచించారు. కేసుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ కోసం ఈ–ఎఫ్‌ఐఆర్‌లు, ఈ–ఛార్జ్‌షీట్‌లు, స్వీకరించిన లేదా తిరస్కరించిన ఈ–ఎఫ్‌ఐఆర్‌లు, ఈ–సమ్మన్స్‌కు సంబంధించిన గణాంకాలను క్రమం తప్పకుండా అందించాలని సూచించారు.

కేసుల దాఖలులో జాప్యం నివారణ....

ఛార్జ్‌షీట్‌లను అన్ని పని దినాల్లో స్వీకరించేలా సంబంధిత కోర్టులతో సమన్వయం చేసుకోవాలని, తద్వారా కేసుల దాఖలు ప్రక్రియలో అనవసర జాప్యాన్ని నివారించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

అలాగే గంగాధర పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత కేసులకు సంబంధించి కోర్టు పరిధి మారిన నేపథ్యంలో, ఆయా కేసుల స్వీకరణకు సంబంధించిన అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు.

న్యాయవ్యవస్థ, పోలీస్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా కోర్టు సంబంధిత ప్రక్రియలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. ఈ సమావేశానికి న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN