Sircilla: 7289 డాక్యుమెంట్పై విచారణ జరపాలి ఆది శ్రీనివాస్!
Sircilla: కేటీఆర్ ప్రస్తావించిన 7289 డాక్యుమెంట్పై సమగ్ర విచారణ జరపాలి. సిరిసిల్ల సబ్రిజిస్ట్రార్ కార్యాలయ RTI ఆధారాలతో విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.
Sircilla: 7289 డాక్యుమెంట్పై విచారణ జరపాలి ఆది శ్రీనివాస్!
Sircilla: బొల్లి రామ్మోహన్కు సంబంధించిన భూముల వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించారు. కేటీఆర్ ప్రస్తావించిన 7289 నంబర్ డాక్యుమెంట్పై అనేక సందేహాలు ఉన్నాయని, అధికారికంగా విచారణ జరిపి వాస్తవాలను తేల్చాలని ఆయన కోరారు.
గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్తో కలిసి ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ ప్రస్తావించిన 12-12-2007 తేదీ, డాక్యుమెంట్ నంబర్ 7289పై స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ అంశంపై తాను సిరిసిల్ల సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆశ్రయించి ఆర్టీఐ ద్వారా సమాచారం కోరినట్లు తెలిపారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ఇచ్చిన సమాచారం ప్రకారం 2007 డిసెంబర్ 31 నాటికి ఆ సంవత్సరంలో రిజిస్టర్ అయిన చివరి బుక్ డాక్యుమెంట్ నంబర్ 5777గా ఉందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
2007 సంవత్సరం ముగిసే నాటికి చివరి డాక్యుమెంట్ నంబర్ 5777గా అధికారిక సమాచారం ఉన్నప్పుడు.. అదే సంవత్సరం 12-12-2007 తేదీతో 7289 నంబర్ డాక్యుమెంట్ ఎలా వచ్చిందనే ప్రశ్న తలెత్తుతోందన్నారు. కేటీఆర్ స్వయంగా 7289 నంబర్ డాక్యుమెంట్ను ప్రస్తావించారని, ఆ డాక్యుమెంట్ను బొల్లి రామ్మోహన్ తనకు పంపించారని చెప్పిన నేపథ్యంలో అధికారులు పూర్తి వివరాలను పరిశీలించాలని కోరారు.
7289 డాక్యుమెంట్ అసలు రిజిస్ట్రేషన్ రికార్డులో ఉందా? దాని తేదీ, నంబర్, బుక్, వాల్యూం, పేజీ వివరాలు ఏమిటి? అనే అంశాలను పరిశీలించాలని అన్నారు. “7289 డాక్యుమెంట్ నిజమైనదా? కాదా? 2007లో 5777 వరకు మాత్రమే డాక్యుమెంట్లు ఉంటే 7289 ఎలా వచ్చింది?” అనే ప్రశ్నలకు కేటీఆర్, బొల్లి రామ్మోహన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ భూముల వ్యవహారంపైనా విచారణ చేయాలి
బొల్లి రామ్మోహన్కు సంబంధించిన సుమారు 2 ఎకరాల 30 గుంటలు, మరో 5 ఎకరాల భూములకు సంబంధించి ప్రభుత్వ భూమి అంశం ఉన్నట్లు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టిందని తెలిపారు.
ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పేర్లపై రిజిస్ట్రేషన్ అయి ఉంటే.. అవి ఎలా నమోదయ్యాయి, ఏ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ జరిగిందనే అంశాలపై రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు సమగ్రంగా విచారణ చేయాలని కోరారు. అక్రమ రిజిస్ట్రేషన్ లేదా నకిలీ పత్రాలు ఉన్నట్లు విచారణలో తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
కొండూరు రవీందర్ రావు భూములపైనా స్పష్టత ఇవ్వాలి
కొండూరు రవీందర్ రావు 2014 తర్వాత తాను ఒక్క గుంట భూమి కూడా కొనుగోలు చేయలేదని చెప్పడం మాత్రమే సరిపోదని ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన ప్రస్తుత రికార్డులపై కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
రవీందర్ రావు పేరుతో సుమారు 14 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నట్లు తాము చెబుతున్నామని, ఈ అంశాన్ని సంబంధిత అధికారులు రికార్డుల ఆధారంగా పరిశీలించాలని కోరారు. ఆ భూమి ప్రభుత్వ భూమిగా నిర్ధారణ అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుని అర్హులైన పేదలకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తోట ఆగయ్య భూమికి సంబంధించిన పాత రికార్డులు, కేటాయింపు ఉత్తర్వులు, ప్రస్తుత హక్కులు, భూమి స్వభావం వంటి అంశాలను కూడా అధికారులు పరిశీలించాలని అన్నారు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు బదులుగా ప్రతి భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.
వాస్తవాలను వక్రీకరించొద్దు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూముల వ్యవహారంపై మాట్లాడిన అంశాలను కేటీఆర్ వక్రీకరిస్తున్నారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాజకీయ కక్షగా చిత్రీకరించకుండా.. ఆయా భూములకు సంబంధించిన రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డులను పరిశీలించాలని సూచించారు.
తాను ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదని, సిరిసిల్ల సబ్రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఆర్టీఐ ద్వారా పొందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రశ్నలు లేవనెత్తుతున్నానని తెలిపారు.
7289 నంబర్ డాక్యుమెంట్ నిజమైనదా, నకిలీదా అనే విషయాన్ని తాము నిర్ణయించడం లేదని.. సంబంధిత రిజిస్ట్రేషన్, రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించాలని అన్నారు. డాక్యుమెంట్ నంబర్, తేదీ, రిజిస్టర్ బుక్, పేజీ నంబర్, ఇండెక్స్, స్కాన్ రికార్డు, సంబంధిత పహాణీ, ధరణి, రెవెన్యూ రికార్డులను సరిపోల్చి పరిశీలిస్తే వాస్తవం బయటపడుతుందని పేర్కొన్నారు.
నకిలీ పత్రాలు ఉపయోగించినట్లు విచారణలో నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో డాక్యుమెంట్ చెల్లుబాటు అవుతుందని నిర్ధారణ అయితే ఆ విషయాన్ని కూడా అధికారులు అధికారికంగా ప్రజలకు వెల్లడించాలని అన్నారు.
కేటీఆర్ క్షమాపణ చెప్పాలి
తమ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను పరిశీలించాలని ఆది శ్రీనివాస్ అన్నారు. 7289 నంబర్ డాక్యుమెంట్ విషయంలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ఇచ్చిన సమాచారానికి, కేటీఆర్ చెప్పిన వివరాలకు మధ్య ఉన్న వ్యత్యాసంపై ఆయన ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేసి ఉంటే కేటీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ వ్యవహారంలో ఎవరి తప్పు ఉన్నా రాజకీయాలకు అతీతంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ప్రైవేటు వ్యక్తుల పేర్లపై నమోదైన భూములకు సంబంధించి సమగ్ర పరిశీలన చేపట్టాలని ఆది శ్రీనివాస్ కోరారు. రాజకీయ నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కంటే అధికారిక రికార్డులను ప్రజల ముందుంచడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
బొల్లి రామ్మోహన్కు సంబంధించిన 7289 డాక్యుమెంట్ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి అది ఎలా నమోదైందో, దాని ఆధారంగా భూమి హక్కులు ఎలా మారాయో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.




