Sircilla: 17వ బెటాలియన్లో మట్టి గణపతి నిమజ్జనం ఘనం
Sircilla: సిరిసిల్ల 17వ పోలీస్ బెటాలియన్లో ప్రతిష్టించిన పర్యావరణహిత మట్టి గణపతి నిమజ్జనాన్ని కమాండెంట్ పి.జె.పి.సి. ఛటర్జీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
Sircilla: 17వ బెటాలియన్లో మట్టి గణపతి నిమజ్జనం ఘనం
సిరిసిల్ల: 17వ పోలీస్ బెటాలియన్లో వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించిన మట్టి గణపతి విగ్రహానికి ఐదు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐదవ రోజు పూజలు పూర్తయిన అనంతరం శనివారం గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని బెటాలియన్ సిబ్బంది ఘనంగా నిర్వహించారు.
బెటాలియన్ కమాండెంట్ పి.జె.పి.సి. ఛటర్జీ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం గణపతి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి నిమజ్జనానికి తరలించారు. సుమారు 350 మంది బెటాలియన్ అధికారులు, సిబ్బంది కాన్వాయ్గా గణపతి విగ్రహం వెంట వెళ్లారు. భక్తి పాటలు, జై గణేశ్ నినాదాలతో గణపతి ఊరేగింపు ఉత్సాహంగా సాగింది.
అనంతరం వెంకటాపూర్ వాగులో గణపతి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. అధికారులు, సిబ్బంది గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.
వినాయక నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన గణపతి లడ్డూ వేలంలో 17వ పోలీస్ బెటాలియన్ హెడ్క్వార్టర్స్ కంపెనీ సిబ్బంది రూ.35 వేలతో లడ్డూను దక్కించుకున్నారు. వేలం కార్యక్రమంలో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణహిత సందేశాన్ని అందించారు. మొత్తం నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో కొనసాగింది.




