Rayachoti: రాయచోటిలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచారం!

Rayachoti: రాయచోటి మున్సిపల్ ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 17 Sept 2026 3:29 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచారం!

Rayachoti: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. రాయచోటి ఎస్‌.ఎన్‌. కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని, వార్డుల వారీగా ప్రజలను కలుసుకుని కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఐక్యంగా పనిచేస్తే కూటమి విజయానికి మరింత బలం చేకూరుతుందని తెలిపారు.

రిజర్వేషన్ల ప్రకారం ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పించడంతో పాటు, పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. పదవులు, అవకాశాల విషయంలో కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు.

వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డిపై మంత్రి మండిపల్లి తీవ్రస్థాయిలో స్పందిస్తూ ప్రజాక్షేత్రంలో గెలవలేమనే ఆలోచనతోనే ఎన్నికలను బహిష్కరించాలని ఆలోచనలతో, కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

ఇలాంటి మాయమాటలు, రాజకీయ ప్రచారాలకు కూటమి నాయకులు, కార్యకర్తలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకంతో, కార్యకర్తల బలంతో ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కొని కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రతి వార్డులో పార్టీ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలని, కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రి సూచించారు. ఎన్నికల సమయంలో వచ్చే ఎలాంటి ప్రలోభాలు, మాయమాటలకు లొంగకుండా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు.

రాయచోటి మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి కార్యకర్తను ఎన్నికల సైనికుడిగా భావించి క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ నాయకత్వం సూచనల మేరకు సమష్టిగా పనిచేసి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని పార్టీ శ్రేణులు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI