Rayachoti: రామాపురం మండలం గొల్లపల్లెలో రాజగోపాల్ రెడ్డి 13వ వర్ధంతి!

Rayachoti: అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గొల్లపల్లెలో ఘనంగా దివంగత మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి 13వ వర్ధంతి.. నివాళులర్పించిన గడికోట శ్రీకాంత్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 18 Sept 2026 3:06 PM IST
Rayachoti
X

Rayachoti: రామాపురం మండలం గొల్లపల్లెలో రాజగోపాల్ రెడ్డి 13వ వర్ధంతి!

Rayachoti: దివంగత మాజీ మంత్రి రెడ్డెప్పగారి రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం అంకితభావంతో సేవలందించి, ప్రజల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న ప్రజానేతగా నిలిచిపోయారని వైఎస్ఆర్ సిపిరాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, హిందూపురం పరిశీలకులు రెడ్డెప్పగారి రమేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

రాజగోపాల్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా రామాపురం మండలం హసనాపురం గ్రామంలోని గొల్లపల్లెలో వైఎస్ఆర్ సిపి నాయకులు కొవ్వూరి ఈశ్వర్ రెడ్డి,పప్పిరెడ్డి అమర నాధరెడ్డి మరియు గ్రామ నాయకులు,కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాజగోపాల్ రెడ్డి విశేషంగా కృషి చేశారని గుర్తుచేశారు. అహింసావాదిగా, ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా ప్రజలకు సేవలందించిన రాజగోపాల్ రెడ్డి రాయచోటి ప్రాంత అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారని తెలిపారు. ముఖ్యంగా వెలిగల్లు తదితర ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

పదవులు, రాజకీయ హోదాలకంటే ప్రజాసేవకే ప్రాధాన్యతనిస్తూ పనిచేసిన రాజగోపాల్ రెడ్డి ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు. ఆయన భౌతికంగా దూరమైనా ప్రజల కోసం చేసిన సేవలు, అభివృద్ధి కోసం సాగించిన కృషి ప్రజల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI