Iran : ఇరాన్లో ఆయుధాలతో మహిళలు భారీ ర్యాలీ... యుద్ధానికైనా త్యాగానికైనా రెడీ
ఇరాన్లో హిజాబ్ ధరించిన మహిళలు రైఫిళ్లతో భారీ ర్యాలీలో పాల్గొన్నారు. టెహ్రాన్లో జరిగిన ‘సాక్రిఫైస్ ఫర్ ఇరాన్’ కార్యక్రమం, 6 లక్షల మంది వాలంటీర్ల నమోదు వెనుక కారణాలేంటి? తెలుసుకుందాం.
Iran : ఇరాన్లో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కుతున్న వేళ.. టెహ్రాన్ వీధుల్లో కనిపించిన దృశ్యాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. హిజాబ్ ధరించిన మహిళలు రైఫిళ్లు చేతబట్టి సైనిక కవాతులో పాల్గొనడం, వేలాది మంది సైనిక దుస్తుల్లో ర్యాలీ చేయడం, డ్రోన్లు, యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థలను ప్రదర్శించడం.. ఇవన్నీ ఒకే సందేశాన్ని ఇచ్చాయి. దేశ రక్షణ కోసం సాధారణ పౌరులను కూడా సిద్ధం చేస్తున్నామని ఇరాన్ ప్రభుత్వం చూపించాలనుకుంటోంది. సెప్టెంబర్ 18న టెహ్రాన్లో జరిగిన ఈ భారీ కార్యక్రమానికి ‘జన్ఫదా-యే ఇరాన్’ అని పేరు పెట్టారు. దాదాపుగా ‘ఇరాన్ కోసం త్యాగం చేసేవారు’ అనే అర్థం వచ్చే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఇరాన్ అధికారుల ప్రకారం రాజధానిలో 3,13,000 మంది పాల్గొన్నారు. అయితే ఈ హాజరు సంఖ్యను స్వతంత్రంగా ధృవీకరించడం సాధ్యం కాలేదని అంతర్జాతీయ మీడియా తెలిపింది.
6 లక్షల మంది శిక్షణకు సిద్ధమా?
ర్యాలీ కేవలం ప్రదర్శనకే పరిమితం కాలేదు. పౌరులను పరిమిత సైనిక, అత్యవసర పరిస్థితుల శిక్షణకు సిద్ధం చేసే కార్యక్రమాన్ని కూడా ఇరాన్ ప్రారంభించింది. టెహ్రాన్ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ హసన్ హసన్జాదెహ్ ప్రకారం.. 6 లక్షల మందికి పైగా ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య 10 లక్షలకు పైగా చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ , దాని వాలంటీర్ విభాగమైన బసీజ్ బలగాలకు అదనపు భద్రతా వ్యవస్థగా ఈ వాలంటీర్లను ఉపయోగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. అసాల్ట్ రైఫిళ్లతో ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నట్లు ఇరాన్ మీడియా ప్రచారం చేసింది.
రైఫిళ్లతో మహిళలు ఎందుకు?
ఈ ర్యాలీలో మహిళల పాల్గొనడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. రివల్యూషనరీ గార్డ్కు చెందిన మహిళా సభ్యులు నల్లటి హిజాబ్లు ధరించి రైఫిళ్లతో కనిపించారు. మరికొందరు మహిళలు, యువత ప్రత్యేక విభాగాల్లో కవాతు చేశారు. దీంతో యుద్ధ సమీకరణాల్లో మహిళలను కూడా దేశ రక్షణలో భాగంగా చూపించే ప్రయత్నం స్పష్టంగా కనిపించింది. ర్యాలీలో సైనిక సామగ్రిని కూడా ప్రదర్శించారు. డ్రోన్లు, యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ బ్యాటరీలు, ఇతర ఆయుధ వ్యవస్థలను ప్రజలకు చూపించారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించడంతో పాటు.. దేశంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న వాతావరణాన్ని చూపించడమే దీని ఉద్దేశంగా కనిపిస్తోంది.
అమెరికా, ఇజ్రాయెల్పై నినాదాలు
ర్యాలీలో కొందరు అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను తొక్కుతూ నిరసన వ్యక్తం చేశారు. “డెత్ టు అమెరికా”, “డెత్ టు ఇజ్రాయెల్” అంటూ నినాదాలు చేశారు. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, సైనికాధికారులు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బసీజ్ కొత్త అధిపతి హొస్సేన్ తాయెబ్ మాట్లాడుతూ.. శిక్షణ పొందే వాలంటీర్లు “పూర్తిస్థాయి రక్షణ”కు సిద్ధంగా ఉంటారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలను ఇతర నగరాల్లోనూ నిర్వహిస్తామని ప్రకటించారు.
ఇరాన్కు ఈ సమీకరణ ఎందుకు?
ఈ ర్యాలీ జరిగిన సమయంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై అమెరికా ఆంక్షలు, సముద్ర మార్గాలపై ఒత్తిడి కొనసాగుతున్నాయి. యుద్ధ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల మధ్య ప్రభుత్వం ప్రజల్లో జాతీయ ఐక్యతను ప్రదర్శించేందుకు ఈ భారీ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు విశ్లేషించాయి. అందుకే టెహ్రాన్ ర్యాలీని కేవలం ఒక రాజకీయ ప్రదర్శనగా చూడలేం. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ప్రతిఘటనను చూపించడం.. మరోవైపు పౌరులను భద్రతా వ్యవస్థలోకి తీసుకురావడం.. రెండూ ఇందులో కనిపిస్తున్నాయి. రైఫిళ్లు చేతబట్టిన మహిళలు, లక్షల సంఖ్యలో వాలంటీర్ల నమోదు, సైనిక ఆయుధాల ప్రదర్శన.. ఇరాన్ నాయకత్వం దేశానికి, బయట ప్రపంచానికి ఒకేసారి పంపిన సందేశంగా ఈ కార్యక్రమం నిలిచింది.




