Chaitanyapuri: చైతన్యపురి గణేష్ మండపాల వద్ద రోడ్డు భద్రత అవగాహన!
Chaitanyapuri: గణేష్ సురక్ష సంకల్ప్–2026లో భాగంగా చైతన్యపురిలో రోడ్డు భద్రతా అవగాహన. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగంపై ఇన్స్పెక్టర్ కె. సైదులు అవగాహన.
Chaitanyapuri: చైతన్యపురి గణేష్ మండపాల వద్ద రోడ్డు భద్రత అవగాహన!
Chaitanyapuri: గణేష్ సురక్ష సంకల్ప్–2026లో భాగంగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆదేశాల మేరకు చైతన్యపురి పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇన్స్పెక్టర్ కె. సైదులు కమిషనరేట్ నుంచి ఎంపికైన సహచరులతో కలిసి భవానీనగర్, జనప్రియ అపార్ట్మెంట్స్ ప్రాంతాల్లోని గణేష్ మండపాలను సందర్శించారు.
ఈ సందర్భంగా మండప నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రజలకు హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరి, అతివేగం–నిర్లక్ష్యపు డ్రైవింగ్కు దూరంగా ఉండాలి, డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వినియోగించకూడదు, మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని పోలీసులు సూచించారు.
గణేష్ మండపాల వద్ద భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున రహదారులపై వాహనాలను ఇష్టానుసారంగా నిలపకుండా నిర్దేశిత ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాలని నిర్వాహకులకు సూచించారు. ట్రిపుల్ రైడింగ్కు దూరంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని తెలిపారు.
అత్యవసర వాహనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా మార్గం కల్పించాలని, పాదచారులు జీబ్రా క్రాసింగ్, సురక్షిత ప్రదేశాలను వినియోగించాలని సూచించారు. మండపాల వద్ద విద్యుత్ వైర్లు, అలంకరణలు, ఇతర సామగ్రి కారణంగా రాకపోకలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
అనంతరం మండప నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రజలతో పోలీసులు సామూహిక రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ఇతరుల భద్రతను కూడా తమ బాధ్యతగా భావిస్తే గణేష్ ఉత్సవాలను సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించవచ్చని చైతన్యపురి పోలీసులు తెలిపారు.




