Hayathnagar: ఆర్టీసీ ఎన్నికల్లో టీఎంయూను గెలిపించండి అశ్వద్ధామ పిలుపు!
Hayathnagar: హయత్నగర్లోని 1, 2 డిపోల ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (TMU) నాయకులు అశ్వద్ధామ రెడ్డి సమావేశమయ్యారు.
Hayathnagar: ఆర్టీసీ ఎన్నికల్లో టీఎంయూను గెలిపించండి అశ్వద్ధామ పిలుపు!
హయత్నగర్: తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత త్వరలో జరగనున్న ఆర్టీసీ కార్మికుల ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ)ను భారీ మెజార్టీతో గెలిపించాలని యూనియన్ నాయకులు అశ్వద్ధామ రెడ్డి కార్మికులను కోరారు.
హయత్నగర్లోని 1, 2 డిపోల కార్మికులతో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వివిధ యూనియన్లకు చెందిన పలువురు కార్మికులు తెలంగాణ మజ్దూర్ యూనియన్లో చేరారు.
గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవని అశ్వద్ధామ రెడ్డి అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కార్మికుల చిరకాల డిమాండ్తో ఈ ఎన్నికలు ముడిపడి ఉన్నాయని తెలిపారు. గతంలో ఈ అంశంపై 35 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అనంతరం ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ విలీనం ప్రక్రియ పూర్తికాలేదన్నారు.
ఆర్టీసీ విలీనం అంశంపై ఇప్పటికే ప్రభుత్వంతో మూడుసార్లు చర్చలు జరిగాయని, ఎన్నికల్లో విజయం సాధించే కార్మిక సంఘాన్ని విలీన ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తామని ప్రభుత్వం తెలిపిందని అశ్వద్ధామ రెడ్డి పేర్కొన్నారు. త్వరలో ప్రభుత్వంతో జరిగే సమావేశం అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.
కార్మికుల సమస్యలను పరిష్కరించగల నాయకత్వాన్ని ఎన్నుకోవాలని, గతంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చేసిన కృషిని గుర్తు చేసుకుని మరోసారి టీఎంయూను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కార్మికులను కోరారు.




