Guntur: గుంటూరులో భవన నిర్మాణ సామగ్రి నిల్వపై హెచ్చరిక!
Guntur: గుంటూరు నగరంలో రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు, సామగ్రి వేస్తే కఠిన చర్యలు.. భారీ జరిమానాలు తప్పవని కమిషనర్ మయూర్ అశోక్ హెచ్చరిక.
Guntur: గుంటూరులో భవన నిర్మాణ సామగ్రి నిల్వపై హెచ్చరిక!
Guntur: గుంటూరు నగరంలోని రహదారులు, కాల్వలు, బహిరంగ ప్రదేశాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు, నిర్మాణ సామగ్రిని ఇష్టానుసారంగా వేస్తే సహించేది లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా రోడ్లను ఆక్రమించి ఇసుక, కంకర, సిమెంట్, ఇటుకలు వంటి భవన నిర్మాణ సామగ్రిని పోగు చేసినా లేదా పాత భవనాల కూల్చివేత, మరమత్తు వ్యర్థాలను పడేసినా, బాధ్యులపై భారీగా జరిమానాలు విధించడంతో పాటు తక్షణమే సదరు భవన నిర్మాణ పనులను నిలిపివేస్తూ 'స్టాప్ వర్క్' నోటీసులు జారీ చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.
ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో పడేసే ఈ నిర్మాణ సామగ్రి మరియు వ్యర్థాల వల్ల వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఆటంకం కలగడమే కాకుండా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అలాగే ఇవి కాలువల్లో చేరి నీటి ప్రవాహానికి అడ్డంకులుగా మారి, కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచిపోయే పరిస్థితి వస్తోందని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ భవన నిర్మాణ లేదా కూల్చివేత వ్యర్థాలను నిబంధనల ప్రకారం నిర్దేశించిన ప్రత్యేక ప్రాంతాలకు మాత్రమే తరలించాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నగర సుందరీకరణను కాపాడటానికి, ప్రజల సురక్షిత రాకపోకలకు ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సహకరించాలని, టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్య విభాగాలు రోడ్లపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని, నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల చర్యలు తీసుకుంటామని తెలిపారు.




