Horrific Crime: మైనర్ బాలికపై గ్యాంగ్రే*ప్ చేసి హత్య.. బాడీని పీక్కుతిన్న కుక్కలు
Horrific Crime: దేశ రాజధాని ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో అత్యంత అమానుష ఘటన వెలుగు చూసింది.
Horrific Crime
Horrific Crime: దేశ రాజధాని ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో అత్యంత అమానుష ఘటన వెలుగు చూసింది. తనకు పరిచయమున్న ఓ పదిహేడేళ్ల బాలుడిని కలిసేందుకు వెళ్లిన 17 ఏళ్ల మైనర్ బాలికపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఆ బాలిక మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. ఆనవాళ్లు దొరకకుండా ఆకులు, మట్టితో కప్పేసేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న కుక్కలు ఆ బాడీని పీక్కుతిన్నాయి. సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం కుషాక్ రోడ్లోని ఓ పొలం దగ్గర తీవ్రంగా కుళ్ళిన స్థితిలో ఈ శవం లభించడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
మృతదేహం తీవ్రంగా కుళ్లిపోవడంతో పాటు కుక్కలు తినేయడం వల్ల దానిని గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది. మరోవైపు బాలిక కుటుంబ సభ్యులు ఆమె తరచూ ఇంటి నుంచి వెళ్లిపోతుండటంతో అప్పట్లో మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఎలాంటి ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ ప్రాంతంలోని యాభైకి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. రాత్రి సమయంలో ఒక టెంపో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. చీకటి కారణంగా ఆ వాహనం నంబర్ స్పష్టంగా కనిపించకపోవడంతో పోలీసులు దాని రూట్ను సుదీర్ఘంగా ట్రేస్ చేశారు.
సెప్టెంబర్ 15, 16 మధ్య రాత్రి నిర్వహించిన సుదీర్ఘ గాలింపు చర్యల్లో భాగంగా పోలీసులు ఆ టెంపోను ఖద్దా కాలనీలో గుర్తించారు. వాహన డ్రైవర్ను విచారించగా ఈ దారుణానికి సంబంధించిన అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ కేసులో 19 ఏళ్ల శివమ్ గణేష్తో పాటు మరో ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన రెండు కత్తులు, వారి బట్టలు అలాగే టెంపోను స్వాధీనం చేసుకున్నారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన తీరుపై పోలీసులు ప్రస్తుతం ఫోరెన్సిక్, సాంకేతిక ఆధారాలను సేకరిస్తూ మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.




