Heavy Rain Alert: వాతావరణ శాఖ కీలక హెచ్చరిక.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న భారీ వర్షాలు

Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

CR Reddy
Published on: 19 Sept 2026 8:24 AM IST
Heavy Rain Alert
X

Heavy Rain Alert

Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా రాగల కొద్దిరోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏర్పడనున్న ఈ అల్పపీడనం, క్రమంగా బలపడి పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే సూచనలున్నాయి. ఇది కాస్తా క్రమంగా వాయుగుండంగా, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా లేదా తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా సెప్టెంబర్ 22, 23 తేదీలలో ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తెలంగాణలో కూడా ఈనెల 20 నుంచి నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నదులు, వాగుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. అలాగే సముద్రంలో అలలు ఉప్పొంగే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. వర్షం పడే సమయంలో ప్రజలు ఎవరూ చెట్లు, విద్యుత్ స్తంభాలు లేదా హోర్డింగుల కింద నిలబడవద్దని సూచించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.