Nara Lokesh: ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో అకడమిక్ ఎక్సలెన్స్పై ఫోకస్!
Nara Lokesh: ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లపై మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు: 10 పాఠశాలలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లుగా మార్పు, నిమ్మకూరులో నీట్/జేఈఈ అకాడమీ, ఏఐ స్కిల్లింగ్ తప్పనిసరి.
Nara Lokesh: ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో అకడమిక్ ఎక్సలెన్స్పై ఫోకస్!
Nara Lokesh: రాష్ట్రంలోని ఏపీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దే కేంద్రాలుగా మారాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పడంతో పాటు విద్యార్థులకు భవిష్యత్ అవసరాలకు సరిపోయే నైపుణ్యాలను అందించాలని అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ అధ్యక్షతన జరిగిన ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ 59వ గవర్నింగ్ బాడీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రెసిడెన్షియల్ స్కూళ్లలో మౌలిక సదుపాయాలతో పాటు అకడమిక్ ఫలితాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఇప్పటివరకు ఈ విద్యాసంస్థల్లో చదువుకున్న వారిలో సుమారు 27 మంది ఐఏఎస్లు, 20 మంది ఐపీఎస్లు, 13 మంది ఐఆర్ఎస్లు, నలుగురు ఐఎఫ్ఎస్లుగా సేవలందిస్తున్నారని అధికారులు వివరించగా.. మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో మరింత మంది ప్రతిభావంతులను తయారు చేయాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా పది ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లుగా అభివృద్ధి చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇప్పటికే తాడికొండ, కొడిగెనహళ్లి పాఠశాలలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లుగా కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా నిమ్మకూరులోని ఏపీఆర్ జేసీ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐఐటీ-జేఈఈ, నీట్ అకాడమీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. మరో ఆరు ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయడానికి కూడా సమావేశం ఆమోదం తెలిపింది.
టెక్నాలజీ రంగంలో వేగంగా మార్పులు వస్తున్న నేపథ్యంలో ఏపీఆర్ జేసీ స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లను బలోపేతం చేసి, ఏఐ స్కిల్లింగ్ను తప్పనిసరి చేయాలని లోకేష్ ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్న ప్రాంతాల్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వృత్తివిద్యా కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ అందించాలని సూచించారు. జగ్గంపేట నియోజకవర్గంలోని భూపతిపాలెం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ను విద్య, క్రీడా హబ్గా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలకు స్టాఫింగ్ ప్యాట్రన్ను ఆమోదించారు. సిబ్బంది పదవీవిరమణ వయోపరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. గెస్ట్ ఫ్యాకల్టీ గౌరవ వేతనాలను ఇతర సొసైటీలతో సమానంగా చెల్లించేందుకు నిర్ణయించారు. పీఈటీలను పీడీలుగా అప్గ్రేడ్ చేయడానికి కూడా బోర్డు అంగీకరించింది.
అన్ని విద్యాసంస్థల్లో శాశ్వత భవనాలు, అవసరమైన కీలక మౌలిక వసతుల కల్పనకు సూత్రప్రాయంగా అంగీకరించారు. విద్యార్థుల వైద్య అత్యవసర పరిస్థితుల్లో లక్ష రూపాయల వరకు ఖర్చు చేసే వెసులుబాటును సెక్రటరీకి కల్పించారు. అన్ని ఏపీఆర్ విద్యాసంస్థల్లో ఆటోమేటెడ్ స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.
ఇదే సమయంలో ఉండవల్లిలో జరిగిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 78వ పాలకవర్గ సమావేశంలోనూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో పాల్గొనే సిబ్బందికి భత్యాలను 25 శాతం వరకు పెంచే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. మూల్యాంకనంలో తీవ్రమైన తప్పిదాలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
1978 నుంచి ఇప్పటివరకు ఇంటర్మీడియట్ బోర్డు జారీ చేసిన అన్ని సర్టిఫికెట్లను డిజిటలైజ్ చేసి, బ్లాక్చైన్ టెక్నాలజీతో అనుసంధానించాలని తీర్మానించారు. బోర్డు సిబ్బంది పదవీవిరమణ వయోపరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు ఆమోదం తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షల్లో థియరీ సబ్జెక్టులకు 32 పేజీల జవాబు పత్రాలు అందించేందుకు నిర్ణయించారు.




