Adilabad: వాగాపూర్లో గణనాథుడికి కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక పూజలు!
Adilabad: మావల మండలం వాగాపూర్లో గణపతి పూజల్లో పాల్గొన్న అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా. నిమజ్జన వేడుకలను శాంతియుతంగా, సమన్వయంతో నిర్వహించాలని పిలుపు.
Adilabad: వాగాపూర్లో గణనాథుడికి కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక పూజలు!
అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా మావల మండలం వాగాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం రాత్రి పాల్గొని గణపయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్థులు కలెక్టర్కు ఘన స్వాగతం పలికారు.
పూజా కార్యక్రమాల అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. గణేష్ ఉత్సవాలు ప్రజల్లో సోదరభావం, ఐక్యతను మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక బాధ్యతను గుర్తుంచుకోవాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడం అభినందనీయమని అన్నారు. గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను మండపాల నిర్వాహకులు, గ్రామస్థులు సమన్వయంతో ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ శాఖల సూచనలు, నిబంధనలను పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు.




