ఆర్టీసీ సమ్మెపై ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ కీలక ప్రకటన చేశారు. లేబర్ కోర్టు నిర్ణయం తీసుకునే వరకు కార్మికులు సంయమనం పాటించాలని అన్నారు. విధుల్లో...
ఆర్టీసీ సమ్మెపై ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ కీలక ప్రకటన చేశారు. లేబర్ కోర్టు నిర్ణయం తీసుకునే వరకు కార్మికులు సంయమనం పాటించాలని అన్నారు. విధుల్లో చేరతామని జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే సహించేది లేదని సునీల్ శర్మ తెలిపారు.
ఆర్టీసీ కార్మికులు ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే, మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని ఎలా చెబుతున్నారని ఎండీ అన్నారు. తమ ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరై, ఇష్టమొచ్చినప్పుడు మళ్లీ విధుల్లో చేరడం దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా ఉండదని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు తమంతట తామే విధులకు గైర్హాజరై, చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు తప్ప ఆర్టీసీ యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ సమ్మె చేయమని చెప్పలేదన్నారు సునీల్ శర్మ.
బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి అతి ముఖ్యమైన పండుగల సమయంలో అనాలోచిత సమ్మెకు దిగి ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ విడుదల చేసిన ప్రతికా ప్రకటనలో తెలిపారు. కార్మికులు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారని చెప్పారు. ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరయ్యి, మళ్లీ ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదని ఎండీ తెలిపారు.
గౌరవ హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విషయంలో కార్మిక శాఖ కమిషనర్ నిర్ణయం తీసుకుంటారని సునీల్ శర్మ చెప్పారు. తర్వాత, ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతా చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు. అప్పటి వరకు అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు.
హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్న కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని తెలిపారు. తమంతట తాముగా సమ్మెకు దిగి, ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరడం చట్ట ప్రకారం కుదరదని ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ చెప్పారు.
కార్మికులు ఇప్పటికే యూనియన్ల మాట విని నష్టపోయారని ఆర్టీ ఎండీ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. ఇక ముందు కూడా యూనియన్ల మాట విని, మరిన్ని నష్టాలు కోరి తెచ్చుకోవద్దు. రేపు డిపోల వద్దకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దని, బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డగించవద్దని కోరారు. అన్ని డిపోల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షించడం జరుగుతుందని చెప్పారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వంగానీ, ఆర్టీసీ యాజమాన్యం గానీ క్షమించదని తెలిపారు. చట్ట పరమైన చర్యలు, క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇదే విషయాన్ని గౌరవ హైకోర్టుకు కూడా తెలియ చేసిందన్నారు ఆర్టీసీ ఎండీ.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire