Coronavirus Update: ఎమ్మెల్సీ నారదాసు, ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి కుటుంబాల్లో కరోనా కలకలం

Arun Chilukuri
Published on: 3 Aug 2020 11:39 AM IST
Coronavirus Update: ఎమ్మెల్సీ నారదాసు, ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి కుటుంబాల్లో కరోనా కలకలం
X
Representational Image

Coronavirus Update: తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతోంది. ముఖ‌్యంగా అధికార టీఆర్ఎస్‌ నేతలకు కోవిడ్ కంగారు పెడుతోంది. వరుసగా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా తెలంగాణ ఎమ్మెల్సీ నారదాసు, పఠానుచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి కుటుంబాల్లో కరోనా కలకలం రేపింది. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తం 8 మందికి కరోనా సోకినట్టు తేలింది. తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన పార్టీ జనరల్ సెక్రటరీల సమావేశంలో నారదాసు పాల్గొన్నారు. మరోవైపు పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డికి కరోనా సోకింది. ఆయనతో పాటు తల్లి, తమ్ముడు, పీఏ, గన్‌మెన్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే చికిత్స పొందుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 983 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 67,660 కి చేరింది. మృతుల సంఖ్య 551 కి పెరిగింది. కరోనా నుంచి కోలుకోని మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 48,609 కి చేరింది. ప్రస్తుతం 18,500 మంది చికిత్స పొందుతున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story