జీహెచ్ఎంసీ చట్ట సవరణకు శాసనసభ ఆమోదం

జీహెచ్ఎంసీ చట్ట సవరణకు శాసనసభ ఆమోదం
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఈ రోజు ఉదయం 11.30 నిమిషాలకు ప్రారంభం అయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాలు జరిగాయి. ఈ...

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఈ రోజు ఉదయం 11.30 నిమిషాలకు ప్రారంభం అయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసి చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టి స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. ఆ తరువాత కేటీఆర్ ప్రవేశపెట్టిన బిల్లును స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఆమోదం తెలిపిన బిల్లుల్లో స్టాంపుల రిజిస్ట్రేషన్‌ చట్టాలకు సంబంధించిన బిల్లు, అగ్రికల్చర్‌ ల్యాండ్‌ సవరణ బిల్లు, జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లు, క్రిమినల్‌ ప్రొసీజర్‌ సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టారు.

ఇక ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులో ఐదు సవరణలు ఏవంటే ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌భుత్వాన్ని ఎస్ఈసీ సంప్ర‌దించాల‌ని చ‌ట్ట స‌వ‌ర‌ణ చేశారు. దీనికి స‌భ ఆమోదం తెలిపింది.

నాలుగు ర‌కాల వార్డు వాలంటీర్ల క‌మిటీల ఏర్పాటుకు స‌భ ఆమోదం తెలిపింది. యూత్ క‌మిటీ, మ‌హిళా క‌మిటీ, సినీయ‌ర్ సిటిజెన్ క‌మిటీ,ఎమినెంట్‌ సిటిజెన్ క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతోనే నాలుగు ర‌కాల క‌మిటీలు తీసుకురాబోతున్నామని మంత్రి తెలిపారు. ఈ క‌మిటీల్లో 50 శాతం మ‌హిళ‌లు ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. శ‌క్తివంత‌మైన అస్ర్తంగా ఈ క‌మిటీల‌ను త‌యారు చేయ‌బోతున్నామ‌ని చెప్పారు. మూడు నెల‌ల‌కొక‌సారి స‌మావేశాలు నిర్వ‌హిస్తామని, క‌మిటీల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన విధివిధానాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని మంత్రి వివరించారు. క‌మిటీల్లో అన్ని వ‌ర్గాల వారికి అవ‌కాశం వ‌స్తుంది.

జీహెచ్ఎంసీ ప‌రిధిలో 10 శాతం గ్రీన్ బ‌డ్జెట్‌కు కూడా స‌భ ఆమోదం తెలిపింది. పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్ చ‌ట్టంలో 10 శాతం బ‌డ్జెట్‌ను గ్రీన్ క‌వ‌ర్‌కు కేటాయించామ‌న్నారు. 85 శాతం మొక్క‌లు బ‌త‌కాల‌నే ఉద్దేశంతో అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు అప్ప‌జెప్పామ‌న్నారు. పంచాయ‌తీరాజ్‌, పుర‌పాల‌క చ‌ట్టం మాదిరిగానే జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌లో మార్పులు తీసుకువ‌స్తున్నామ‌ని తెలిపారు. గ‌తంలో 2.5 శాతం ఉన్న గ్రీన్ బ‌డ్జెట్‌ను 10 శాతానికి పెంచుతున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ‌లో 5 నుంచి 6 శాతం గ్రీన్ క‌వ‌ర్ పెరిగింద‌ని కేంద్రం ఓ నివేదిక విడుద‌ల చేసిందని గుర్తు చేశారు. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న న‌గ‌రాన్ని హ‌రిత‌న‌గ‌రంగా మార్చేందుకు ఈ స‌వ‌ర‌ణ ఉప‌యోగప‌డుతుంద‌ని కేటీఆర్ చెప్పారు.

మ‌హిళ‌ల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను క‌ల్పిస్తూ జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుకు స‌భ ఆమోదం తెలిపింది. మ‌హిళా సాధికార‌త‌కు పెద్ద‌పీట వేయాల‌నే ఉద్దేశంతోనే ఈ సవరణను చ‌ట్టం చేసుకుంటున్నామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2015లో ఒక ప్ర‌త్యేక‌ జీవో ద్వారా కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు 50 శాతం స్థానాల‌ను మ‌హిళ‌ల‌కే ఆమోదించుకున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. బీసీల రిజ‌ర్వేష‌న్లు య‌ధాత‌థంగా కొన‌సాగుతాయ‌ని కేటీఆర్ చెప్పారు.

జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లులో భాగంగా 10 ఏళ్లకోసారి రిజ‌ర్వేష‌న్ల మార్పున‌కు స‌భ ఆమోదం తెలిపింది. రెండు ట‌ర్మ్‌లు ఒకే రిజ‌ర్వేష‌న్ ఉండేలా పంచాయ‌తీరాజ్‌, పుర‌పాల‌క చ‌ట్టంలో తీసుకువ‌చ్చాం. మాటిమాటికి రిజ‌ర్వేష‌న్లు మార్చడం వ‌ల్ల ప్ర‌జాప్ర‌తినిధుల‌కు జ‌వాబుదారీ త‌నం లేకుండా పోతోంది. దీని వ‌ల్ల ప్రజాప్రతినిధులు ప్రజ‌ల‌కు మ‌రింత చేరువై అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని అన్నారు. అదే పాల‌సీని జీహెచ్ఎంసీ యాక్ట్‌లో చేర్చతున్నామ‌ని మంత్రి కేటీఆర్ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories