కరోనా వ్యాక్సిన్ మనదగ్గర నుంచే : ప్రధానితో తెలంగాణా సీఎం కేసీఆర్
రైలు ప్రయాణీకులందరినీ క్వారంటైన్ చేయడం సాధ్యం అయ్యే పని కాదని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తన అభిప్రాయాలను విస్పష్టంగా తెలియచేశారు. దేశంలోని ప్రధాన నగరాల్లోనే కరోనా ప్రభావం అధికంగా ఉందని, ఇప్పుడప్పుడే కరోనా మనల్ని వదిలిపోయేలా లేదని ఆయన అన్నారు. ఈ నేపధ్యంలో ప్రయాణికుల రైళ్లను అప్పుడే పునరుద్ధరించొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని కోరారు. దశల వారీగా ప్రయాణికుల రైళ్లను నడిపేందుకు కేంద్రం ముందడుగు వేస్తున్నందున ఈ విషయం పై పునరాలోచించాలని అయన అన్నారు.
ఇక కరోనా ప్రభావం ఈ ఆర్థిక సంవత్సరంపై తీవ్ర దుష్పరిణామం చూపించిందని కేసీఆర్ చెప్పారు. అప్పులు చెల్లించే పరిస్థితి లేనందున రుణాలను రీషెడ్యూల్ చేయాలని సీఎం కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల రుణ పరిమితిని పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో ఇంకా కేసీఆర్ ఏమన్నారంటే..
- వలస కూలీలను అనుమతించకపోతే ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది.
- ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలి.
- కరోనా వైరస్కు జులై, ఆగస్టు మాసాల్లోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది.
- ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నం అవ్వగా.. భారత్ నుంచి, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచే ఈ వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
- కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి.




