ఇండియా క్లీన్ స్వీప్ : మెరిసిన పంత్

K V D Varma
Updated on: 7 Aug 2019 12:10 PM IST
ఇండియా క్లీన్ స్వీప్ : మెరిసిన పంత్
X

తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్ తో సమాధానం చెప్పాడు భారత్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. వెస్టిండీస్ తో జరిగిన చివరి టీ20లో పంత్ 42 బంతుల్లో 65 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడంతో విండీస్ పై విజయభేరి మోగించింది. 3మ్యాచ్ ల ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మరోపక్క కోహ్లీ కూడా అర్థ సెంచరీ చేశాడు. వెస్టిండీస్‌ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 19.1 ఓవర్లలో ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

147 పరుగుల చేదనకు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. ఈ సిరీస్ మొదటి రెండు మ్యాచ్ లలోనూ త్వరగానే అవుట్ అయిన ధావన్ ఈసారీ 3 పరుగులకే థామస్ బౌలింగ్లో పెవిలియన్ కు చేరాడు. తర్వాత రాహుల్ కొన్ని మెరుపులు మెరిపించినా.. 18 బంతుల్లో 20 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ దశలో కోహ్లీ తో జత కలసిన పంత్ ఇన్నింగ్స్ ను మెల్లగా గాడిలో పెట్టాడు. కోహ్లీ, పంత్ లు ఆచి తూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో 16 ఓవర్లో కోహ్లీ, 17వ ఓవర్లో పంత్ తమ అర్థ సెంచరీలు అందుకున్నారు. తరువాతి ఓవర్లో షాట్ ఆడబోయిన కోహ్లీ థామస్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. చివరి ఓవర్లో సిక్సర్ తో భారత్ కు విజయాన్ని అందించాడు పంత్.



K V D Varma

K V D Varma

Next Story