పతంజలి కరోనా మందుకు కేంద్రం బ్రేక్

Arun Chilukuri
Updated on: 24 Jun 2020 10:38 AM IST
పతంజలి కరోనా మందుకు కేంద్రం బ్రేక్
X

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి నివారణకు ఆయుర్వేద మందును లాంచ్ చేసిన యోగా గురువు బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని పతంజలి సంస్థకు ఆదిలోనే అడ్డుకట్ట పడింది. ఈ మందును ప్రచారం చేయడంపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఈ అంశంపై పరిశీలన జరిపే వరకు ఎటువంటి ప్రకటనలు జారీ చేయరాదని స్పష్టం చేసింది. ఆయుర్వేద ఔషధం కరోనిల్ ప్రారంభానికి ముందు నిర్వహించిన పరిశోధనల పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలి సంస్థను ఆదేశించింది. పతంజలి చెబుతున్న అంశాలపై వాస్తవాలు, శాస్త్రీయ అధ్యయన వివరాలు మంత్రిత్వ శాఖకు తెలియదని పేర్కొంది.

కరోనాను నయం చేస్తుందంటూ పతంజలి సంస్థ కరోనిల్‌ పేరిట మంగళవారం ఓ ఆయుర్వేద ఔషధాన్ని మార్కెట్‌లో విడుదల చేసిన విషయం విదితమే. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉన్న పతంజలి గ్రూప్‌ ప్రధాన కార్యాలయంలో ఈ మెడిసిన్‌ను ఆ సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ, బాబా రాందేవ్‌లు ఆవిష్కరించారు. 'కొరోనిల్', 'శ్వాసరి' అనే మందులను హరిద్వార్‌లోని పతంజలి యోగ్‌పీఠ్‌లో కొందరు కోవిడ్-19 రోగులపై ప్రయోగాత్మకంగా పరీక్షించామని పతంజలి గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఆయుష్‌ మంత్రిత్వ శాఖ అనుమతి లభించాకే పతంజలి ఈ మెడిసిన్‌ను విక్రయించాల్సి ఉంటుంది. అప్పటి వరకు వేచి చూడక తప్పదు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story