
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'.. అసలు విడుదలవుతుందా లేదా అనుకున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో మన రివ్యూలో చూద్దాం.
కథ
2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆర్సీపీ పార్టీపైన వెలుగు దేశం పార్టీ ఓడిపోతుంది. ఆ ఎన్నికల్లో 151 సీట్లతో జగన్నాథ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఆ ఎన్నికల్లో ఎదురైనా పరాభవానికి ఆర్సీపీ పార్టీని దెబ్బకొట్టాలని చూస్తారు వీడీపీ పార్టీ నేతలు.. కానీ సీఎం జగన్నాథ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ప్రజలలో మంచి పేరును సంపాదించుకుంటాడు. ఈ తరుణంలో వీడీపీ పార్టీ నేత అయిన దయనేని రమా ప్రభుత్వంపై, సీఎంపై తీవ్ర ఆరోపణలు చేస్తారు. ఈ క్రమంలో బెజవాడ బెంజ్ సర్కిల్లో ప్రజలంతా చూస్తుండగానే దయనేని రమాను కొంత మంది దారుణంగా హత్య చేస్తారు. ఆ హత్య చేసింది ఎవరు అన్నదాని చూట్టు కథ నడుస్తుంది.
ఎలా ఉందంటే?
2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలను బేస్ చేసుకొని ఓ కల్పిత కథను ఎంచుకున్నాడు దర్శకుడు సిద్ధార్థ తాతోలు. సినిమా మొదటి భాగం ప్రేక్షకుడికి తెలిసిన కథనే చెప్పుకొచ్చాడు. తెలిసిన కథనే కావడంతో మొదటి భాగం పెద్దగా ఇంపాక్ట్ అనిపించదు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్లో దయనేని రమా హత్యతో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. ఇంతకి హత్య చేసింది ఎవరన్న ఆసక్తి ప్రేక్షకుడిలో కలుగుతుంది. కానీ ఆ ఆసక్తిని చివరివరకు మైంటైన్ చేయలేకపోయాడు దర్శకుడు.
రెండవ భాగంలో పీపీ జాల్ పాత్రతో నవ్వించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇక దయనేని రమాని హత్య చేసింది ఎవరు అన్నది చెప్పకుండానే కథకి శుభం కార్డు వేశాడు దర్శకుడు. అదొక రాజకీయపు హత్యలాగే చూపించాడు. దాని చుట్టూ తిరిగిన రాజకీయాన్ని మాత్రమే సినిమాగా చూపించారు. పాత్రకి తగ్గ నటినటులను ఎంచుకోవడం, వారి పాత్రలను రసవత్తరంగా తెరకెక్కించడంలో దర్శకుడు ప్రతిభను మెచ్చుకోవాలి. కానీ పాత్రల డబ్బింగ్ కొంచం ఇబ్బందిగా అనిపిస్తుంది.
నటినటులు :
నటీనటుల విషయానికి వచ్చేసరికి అందరు తమ పాత్రలకి న్యాయం చేసారనే చెప్పాలి. సీఎం జగన్నాథ రెడ్డి పాత్రలో అజ్మల్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సాంకేతిక వర్గం :
సినిమాని హై క్వాలిటీతో తెరకెక్కించారు. అందులో కెమరామెన్ ప్రతిభను మెచ్చుకోవాలి. అసెంబ్లీ సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి. మాటలు బాగున్నాయి. రవి శంకర్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయిని మెప్పించాయి.
చివరగా :
సినిమా ట్రైలర్ ని ఆసక్తికరంగా మార్చిన దర్శకుడు సినిమాని కూడా అంతే ఆసక్తికరంగా మార్చడంలో విఫలం అయ్యాడనే చెప్పాలి. ఒక సెటైరికల్ ఎంటర్టైనర్ను రామ్ గోపాల్ వర్మ అండ్ కో తెలుగు ప్రేక్షకులకు అందించింది. ఇక సినిమా చివరలో కూడా 'రాజకీయాల్లో అయినా, మీడియాలో అయినా, సినిమాల్లో అయినా ప్రజలకు కావాల్సింది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే' అని స్వయంగా వర్మనే చెప్పడం మరో విశేషం.
గమనిక : ఈ సమీక్ష ఒక విమర్శకుడి ఆలోచన మాత్రమే.. ఇది ఆ విమర్శకుడి వ్యక్తిగత అభిప్రాయం.. దీనితో అందరు ఎకిభావించాలని లేదు. ఎవరికీ వారు సినిమా చూసి తమ అభిప్రాయాన్ని సరిచూసుకోవచ్చు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




