అంబులెన్స్‌ల నిర్వహణ కాంట్రాక్టులో స్కామ్ జరగడం సిగ్గుచేటు.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి

వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

Samba Siva Rao
Published on: 22 Jun 2020 8:53 PM IST
అంబులెన్స్‌ల నిర్వహణ కాంట్రాక్టులో స్కామ్ జరగడం సిగ్గుచేటు.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి
X
Chandrababu naidu (File Photo)

వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రజల ప్రాణాలను నిలబెట్టే 108 అంబులెన్స్‌ల నిర్వహణ కాంట్రాక్టులో అవినీతి జరగడం సిగ్గుచేటని అన్నారు. గత ఒప్పందం ప్రకారం బీవీజీ సంస్థకు 2020 డిసెంబరు 12 వరకు కాలపరిమితి ఉందని వెల్లడించారు. అయితే 15 నెలల ముందే 2019 సెప్టెంబరు 20న కొత్త ఏజెన్సీ కోసం 111 జీవో ఎందుకు తెచ్చారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్‌లో ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు.

అంబులెన్స్ స్కామ్ వెలుగులోకి వస్తే అవినీతికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కుంభకోణాన్ని బయటపెట్టిన టీడీపీ నేత పట్టాభిరామ్‌పై వేధింపులకు దిగడం ఏంటి? హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి? అని నిలదీశారు. అంబులెన్స్ నిర్వహణ ఒప్పందం అమలులో ఉండగా 10 నెలల ముందుగానే 2020 ఫిబ్రవరి 13న జీవో 116 తో బీవీజీ సంస్థ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేశారు? అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఫైనాన్స్‌ విధానంలో కొనుగోలు చేయగలిగిన అంబులెన్సులను జీవో 117తో నేరుగా డబ్బులు చెల్లించి ఎందుకు కొన్నారు?.. ఒక్కొక్క పాత అంబులెన్సుకు రూ.47 వేలు, కొత్త అంబులెన్సుకు రూ.90 వేలు చొప్పున నిర్వహణ ఖర్చులు పెంచి... వైసీపీ ఎంపీ అల్లుడికి చెందిన సంస్థకు ఉన్నపళంగా కాంట్రాక్టులు కట్టబెట్టడంలో మతలబు ఏంటి? అని చంద్రబాబు వరుస ప్రశ్నలు సంధించారు.




Samba Siva Rao

Samba Siva Rao

Next Story