YCP MLC candidates: ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు? వారు వీరే..

YCP MLC candidates: ఏపీలో నాలుగు శాసనమండలి స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో రెండు గవర్నర్ కోటాలో ఖాళీ అవ్వగా.. మరో రెండు మాత్రం.. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నికవ్వడంతో ఖాళీ ఏర్పడ్డాయి.

Raj
By Raj
Published on: 18 July 2020 1:43 PM IST
YCP MLC candidates: ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు? వారు వీరే..
X
YCP MLC candidates

YCP MLC Candidates: ఏపీలో నాలుగు శాసనమండలి స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో రెండు గవర్నర్ కోటాలో ఖాళీ అవ్వగా.. మరో రెండు మాత్రం.. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నికవ్వడంతో ఖాళీ ఏర్పడ్డాయి. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ నివహించిన స్థానం పదవీకాలం మరో 9 నెలల్లో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఈ స్థానాన్ని పక్కబెట్టి మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చెయ్యాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట.. అయితే ఈ మూడు స్థానాలకు మాత్రం అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్టే అని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. మూడు స్థానాలను ప్రాంతాల వారీగా భర్తీ చెయ్యాలని జగన్ నిర్ణయించారు. గవర్నర్ కోటా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొయ్య మోషేను రాజు, అలాగే కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన ముస్లిం మైనారిటీ మహిళా కార్యకర్త జకియా ఖానం' ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

ఇక మూడోది గుంటూరు జిల్లా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు కేటాయించినట్టు తెలుస్తోంది. కొయ్య మోషేను రాజుకు గత ఎన్నికల్లో గోపాలపురం అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాల్సి ఉన్నా అనివార్య కారణాలతో మరో నేతకు ఇవ్వడంతో మోషేను రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. ఇక కడప జిల్లాలో రాయచోటి నియోజకవర్గానికి చెందిన మహిళా నేత జకియా ఖానంకు ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ ఓదార్పు యాత్రలో హామీ ఇచ్చారు. ఒకవేళ ఆమెకు ఎమ్మెల్సీ ఖరారైతే ముస్లిం మహిళకు ఎమ్మెల్సీ ఇవ్వడం రాష్ట్రం విడిపోయాక ఇదే తొలిసారి అవుతుంది. ఇక ఎమ్మెల్యే కోటా స్థానంలో ఒకదానిని అందరూ అనుకుంటున్నట్టు మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ పేర్లు మరో రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.

Raj

Raj

Next Story