అమరావతికి రుణం.. ఏఐఐబీ వెనకడుగు

K V D Varma
Published on: 24 July 2019 12:37 PM IST
అమరావతికి రుణం.. ఏఐఐబీ వెనకడుగు
X

రాజధాని అమరావతి నిర్మాణానికి ఇవ్వాలనుకున్న రుణాన్ని ఇవ్వలేమని ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌(ఏఐఐబీ) స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదన రద్దు చేసుకుంటున్నట్టు ఏఐఐబీ అధికార ప్రతినిధి లారెల్‌ ఆస్ట్‌ఫీల్ట్‌ తమకు ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేసినట్టు రాయిటర్స్‌ వార్తాసంస్థ మంగళవారం వెల్లడించింది. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని రాయిటర్స్‌ తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. అది ఇక తమ పరిశీలనలో లేనట్టే అని ఆయన వెల్లడించారు.

అమరావతి ప్రాజెక్టుకు 715 మిలియన్‌ డాలర్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దీనిలో దీనిలో ప్రపంచబ్యాంకు 300 మిలియన్‌ డాలర్లు, ఏఐఐబీ 200 మిలియన్‌ డాలర్లు రుణంగా ఇవ్వాలన్నది ప్రతిపాదన. మార్కెట్ లో డాలరు విలువ ప్రకారం అది 3,450 రూపాయలు. అమరావతికి ఋణం కోసం చేసిన వినతిని భారత ప్రభుత్వం వెనక్కి తీసుకుందని చెబుతూ ఇటీవల ప్రపంచబ్యాంక్ రుణ ప్రతిపాదనను విరమించుకున్నామని ఇంతకు ముందు చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే దారిలో ఇప్పుడు ఏఐఐబీ సైతం నిర్ణయం తీసుకుంది.

కొత్త ప్రభుత్వం పై కావాలనే దుష్ప్రచారం.. ముఖ్యమంత్రి కార్యాలయం

అమరావతికి ప్రపంచబ్యాంకు రుణం నిలుపుదల అంశంపై శాసనసభలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసినా కొన్ని వర్గాలు పనిగట్టుకుని పదేపదే వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్లే రాజధానికి ప్రపంచబ్యాంకు రుణం నిలిపివేసిందని మరోసారి స్పష్టంచేశాయి. ప్రతిపాదిత ప్రాజెక్టులో ప్రపంచబ్యాంకుతో పాటు ఏఐఐబీ భాగస్వామి అని, కేంద్రం తీసుకున్న వైఖరి ఈ ప్రాజెక్టులోని భాగస్వాములందరికీ వర్తిస్తుందని సీఎంవో వర్గాలు తెలిపాయి.

K V D Varma

K V D Varma

Next Story