Burning Topic: జీ7 సమ్మిట్ లో ఇచ్చి పడేసిన ప్రధాని మోదీ.. షాక్ లో ప్రపంచ దేశాలు

Burning Topic: జీ7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలను ఉద్దేశించి చేసిన కీలక ప్రసంగం.

Update: 2026-06-18 01:16 GMT

Burning Topic: జీ7 సమ్మిట్ లో ఇచ్చి పడేసిన ప్రధాని మోదీ.. షాక్ లో ప్రపంచ దేశాలు

Burning Topic: ఫ్రాన్స్‌లోని ఎవియన్‌ నగరంలో 52వ జీ 7 కూటమి సదస్సు అట్టహాసంగా కొనసాగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌ ఆహ్వానం మేరకు ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఈ సదస్సుకు వచ్చారు. జీ7 సదస్సులో భాగస్వామ్య దేశంగా భారత్​ పాల్గొనడం ఇది 13వ సారి కాగా, ప్రధాని మోదీ వరుసగా ఏడోసారి వెళ్లడం గమనార్హం. కాగా, ప్రధాని మోదీ ఈ జీ-7 ఉమ్మడి సమావేశాలతోపాటు, సపరేటుగా వివిధ దేశాల నేతలతో ప్రత్యేకంగా దౌత్య చర్చలు జరపనున్నారు. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, బ్రిటన్‌ ‌ప్రధాని కీర్‌ ‌స్టార్మర్‌, కెనడా ప్రధాని మార్క్‌ ‌కార్నీ, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తదితర నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఈజిప్ట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకులు కూడా ఈ చర్చల్లో పాల్గొనేందుకు వచ్చారు. సదస్సుకు హాజరైన దేశాధినేతలంతా ఆహ్లాదకర వాతావరణంతో గ్రూప్ ఫోటో దిగారు.

జీ-7 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జీ-7 సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన సంప్రదాయ 'ఫ్యామిలీ ఫోటో' సెషన్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపు ముచ్చటించారు. ఇద్దరు నేతలు కరచాలనం చేసుకోగా, మోదీ భుజంపై ట్రంప్ ఆప్యాయంగా తట్టారు. గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్‌లో జరిగిన పర్యటన తర్వాత వీరిద్దరూ నేరుగా కలుసుకోవడం ఇదే తొలిసారి. ఆ తర్వాత జరిగిన అవుట్‌రీచ్ సెషన్‌లోనూ ఇరు దేశాల అధినేతలు పక్కాపక్కనే కూర్చుని చర్చల్లో పాల్గొన్నారు.

గతేడాది ఫిబ్రవరి తర్వాత వీరిద్దరూ ప్రత్యక్షంగా పలకరించుకోవడం ఇదే మొదటిసారి. ఈ మధ్యకాలంలో సుంకాల యుద్ధం‌, ఆపరేషన్‌ సిందూర్‌ పరిణామాల నడుమ.. కీలక సదస్సులోనూ ఈ ఇద్దరూ ఒక్కచోట కనిపించలేదు. ఈ వ్యవహారం అంతర్జాతీయంగానూ ఆసక్తికర చర్చకు దారి తీసింది.

జీ7 సదస్సు వేదికపై పశ్చిమాసియాలో ఇటీవల అమెరికా సైన్యం జరిగిపిన దాడుల్లో భారత నావికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్థావించారు. అంతర్జాతీయ ఘర్షణల వల్ల నావికులు ఎదుర్కొంటున్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. “కొత్త భాగస్వామ్యాలు – అంతర్జాతీయ ఐక్యత పునర్నిర్మాణం” అంశంపై మాట్లాడిన మోదీ.. పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించడానికి జరుగుతున్న ప్రయత్నాలను స్వాగతించారు. అదే సమయంలో అక్కడ కొనసాగుతున్న సైనిక చర్యల వల్ల సంభవిస్తున్న ప్రాణ, ఆస్తి నష్టాల పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. నావికులు ఎలాంటి భయాందోళనలు, ప్రాణ భయం లేకుండా తమ విధులను నిర్వర్తించుకునే వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందే ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్‌ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయాయి. దీనిని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనకబడిన దేశాలను వాటిమానాన వాటిని వదిలేయొద్దని, వాటికి సహకరించేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతోన్న దేశాలు ఈ షాక్‌లను తట్టుకొనేలా వ్యవస్థలు ఉండాలన్నారు. ఆయా దేశాల్లో ఉన్న మానవ వనరులను ప్రపంచ అభివృద్ధి భాగం చేసుకోవాలని సూచించారు. జీడీపీ, వాణిజ్య గణాంకాలను దాటి, ఆర్థిక వృద్ధిపై చర్చలు ఉండాలన్నారు. ‘అందరికీ సమాన, స్థిర ఆర్థిక వృద్ధి అంశం’పై చర్చ జరపడం మంచి విషయమన్నారు. ‘‘వృద్ధి గురించి ప్రస్తావన వస్తే.. జీడీపీ, వాణిజ్య గణాంకాలు ప్రధానంగా ఉండకూడదు. ఎవరికి వృద్ధి? అది ఏ దిశలో ఉంది? అనే అంశాలను చర్చించాలి’’ అని మోదీ పేర్కొన్నారు. మానవాళి పురోగతి, శ్రేయస్సు కోసం అంతర్జాతీయ భాగస్వామ్యం అత్యవసరమన్నారు.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణాపై జీ7 సభ్య దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వలసదారుల స్మగ్లింగ్‌, మానవ అక్రమ రవాణా ద్వారా లాభాలు పొందుతున్న అంతర్జాతీయ నేర ముఠాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే మాదక ద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, అక్రమ ఆర్థిక లావాదేవీలను అడ్డుకునేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ప్రకటించారు. ఈ ప్రకటనకు భాగస్వామ్య దేశాలైన కెన్యా, సౌత్​ కొరియా కూడా మద్దతు ప్రకటించాయి. వలసదారుల స్మగ్లింగ్‌, మానవ అక్రమ రవాణా కార్యకలాపాలు దేశాల సరిహద్దు నియంత్రణ వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయని, అదే సమయంలో వలసదారులను ప్రాణాపాయ పరిస్థితుల్లోకి నెడుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, శరణార్థులు ఈ నేర ముఠాల చేతుల్లో ఎక్కువగా దోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సదస్సు ముగింపులో జీ7 దేశాలు కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై ఒత్తిడి పెంచాలని జీ7 దేశాధినేతలు నిర్ణయించారు. ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో జీ7 నేతలతో ఉదయం జరిగిన వర్కింగ్ సెషన్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ పాల్గొన్నారు. యుద్ధం ముగించేలా రష్యా చమురు, గ్యాస్‌పై ఆంక్షలు విధించి మరింత ఒత్తిడి పెంచాలని జీ7 నేతలు అంగీకరించారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌కు ఎయిర్ డిఫెన్స్‌, ఇతర ఆయుధ వ్యవస్థలు అందించడానికి అంగీకరించారని తెలిపారు. ఉక్రెయిన్‌కు ట్రంప్ సైనిక సాయం తగ్గించినందున ఇప్పుడు ఫ్రాన్స్, ఐరోపా దేశాలే సైనిక, ఆర్థిక మద్దతు ఇస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల అమెరికాపై ఎలాంటి ప్రభావం ఉండదన్న ట్రంప్, అక్కడ జరుగుతున్న ప్రాణనష్టం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేయగలిగినదంతా చేస్తానని చెప్పారు. జీ7 నాయకులు ఉక్రెయిన్‌కు ఏకగ్రీవ మద్దతును ప్రకటించారని సమావేశం తర్వాత జెలెన్‌ స్కీ చెప్పారు. 



Full View


Tags:    

Similar News