Hanamkonda: హనుమకొండలో మిస్టరీ.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కూతుళ్ల మృతి.. హత్యేనా?

Hanamkonda: హనుమకొండ జిల్లాలో విషాదం. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కుమార్తెలు అనుమానాస్పద స్థితిలో మృతి.

Update: 2026-04-02 06:07 GMT

Hanamkonda: హనుమకొండలో మిస్టరీ.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కూతుళ్ల మృతి.. హత్యేనా?

Hanamkonda: హనుమకొండ జిల్లాలోని ఐనవోలు మండలం పున్నేల్ గ్రామ శివారులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు స్విమ్మింగ్ పూల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మృతులలో తల్లితో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకోగా, ఇది ప్రమాదమా లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఘటన వివరాలివే..

మహమ్మద్ చాంద్ పాషా అనే వ్యక్తి పున్నేల్ గ్రామ శివారులోని ధరణి వెంచర్‌లో స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి చాంద్ పాషా కుమారుడు హజారుద్దీన్, తన భార్య ఫర్హాత్ (26), కుమార్తెలు ఉమేరా (8), అయేషా (6)లతో కలిసి స్విమ్మింగ్ పూల్ వద్దకు వచ్చారు. అయితే, కొద్దిసేపటికే ముగ్గురూ స్విమ్మింగ్ పూల్‌లో విగతజీవులుగా పడి ఉండటం చూసి అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతురాలు ఫర్హాత్ ప్రస్తుతం మూడు నెలల గర్భిణీ అని పోలీసులు తెలిపారు.

కుటుంబ సభ్యుల అనుమానాలు - భర్తపై ఆరోపణలు

వారు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారని భర్త హజారుద్దీన్ చెబుతుండగా, ఫర్హాత్ తండ్రి ఎస్.కె. అలీ మాత్రం ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని ఆరోపిస్తున్నారు. ప్రెగ్నెన్సీ విషయంలో గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఆ కక్షతోనే హజారుద్దీన్ తన భార్యను, ఇద్దరు పిల్లలను చంపి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రంగంలోకి పోలీసులు.. సీసీ ఫుటేజ్ కీలకం

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ రాత్రి అసలు ఏం జరిగింది? ముగ్గురు ఎలా మృతి చెందారు? అనే విషయాలను సీసీ ఫుటేజ్ ఆధారంగా తేల్చనున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఐనవోలు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News