చదివించి ఆఫీసర్‌ని చేస్తే.. అక్రమ కేసులతో వేధించింది: నేరేడ్‌మెట్‌లో వ్యక్తి బలవన్మరణం!

Neredmet: భార్య వేధింపులు, వరుస కోర్టు కేసులతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.

Update: 2026-03-12 06:20 GMT

చదివించి ఆఫీసర్‌ని చేస్తే.. అక్రమ కేసులతో వేధించింది: నేరేడ్‌మెట్‌లో వ్యక్తి బలవన్మరణం!

Neredmet: భార్య వేధింపులు, వరుస కోర్టు కేసులతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. కట్టుకున్న భార్య ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించిన భర్తకే చివరకు వేధింపులు ఎదురవ్వడం స్థానికంగా విషాదం నింపింది.

కేసు వివరాల్లోకి వెళ్తే..

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన నగెల్లి శ్రీనివాస్ (41) నేరేడ్‌మెట్ లక్ష్మీనగర్‌లో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. 2012లో సట్లపల్లి జ్యోతితో ఇతనికి వివాహం జరిగింది, వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లయ్యాక భార్యను ఉన్నత చదువులకు ప్రోత్సహించిన శ్రీనివాస్, ఆమె ఎక్సైజ్ సీఐగా ఎదిగేలా తోడ్పడ్డాడు.

ఉద్యోగం వచ్చాక మారిన తీరు:

అయితే, ఎక్సైజ్ సీఐగా బాధ్యతలు చేపట్టాక జ్యోతి ప్రవర్తనలో మార్పు వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్తను దూరం పెట్టడమే కాకుండా, శ్రీనివాస్ కుటుంబంపై వరకట్న వేధింపులు, విడాకుల కేసులు పెట్టి మానసికంగా వేధించింది. గత నాలుగు నెలలుగా భార్యకు దూరంగా ఉంటున్న శ్రీనివాస్, ఈ కేసుల వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్:

"నా భార్య పెట్టిన వేధింపులు, అక్రమ కేసుల వల్లే నేను తనువు చాలిస్తున్నాను" అని సూసైడ్ నోట్ రాసి, మంగళవారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం సోదరుడు శివకృష్ణ వచ్చి చూసేసరికి శ్రీనివాస్ విగతజీవిగా కనిపించాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ సీఐ జ్యోతితో పాటు మరో 10 మందిపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు నేరేడ్‌మెట్ పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News